రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీతో విభేదించిన నీతి ఆయోగ్: పునఃసమీక్షిస్తాం
న్యూఢిల్లీ: దేశీయ అత్యున్నత బ్యాంకింగ్.. రిజర్వ్బ్యాంక్ ప్రకటించిన మానిటరింగ్ పాలసీతో నీతి ఆయోగ్ విభేదించింది. రిజర్వ్బ్యాంక్ అంచనా వేసిన విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 9.5 శాతానికి మాత్రమే పరిమితం కాబోదని తెలిపింది. జీడీపి వృద్ధిరేటు మరింత అధికంగా ఉంటుందని పేర్కొంది. ఇదివరకు రిజర్వ్బ్యాంక్ ప్రకటించిన విధంగా 10.5 శాతం వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్బీఐ మానిటరింగ్ పాలసీని తాము త్వరలోనే పునఃసమీక్షిస్తామని నీతి ఆయోగ్ వెల్లడించింది.
Twitterకు రివర్స్ షాక్: శాశ్వత నిషేధం: దేశాధ్యక్షుడి పోస్టులను తొలగించిన ఫలితం
రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్.. శుక్రవారం మానిటరింగ్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకు అంచనా వేసిన విధంగా జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతం వరకు నమోదు కాకపోవచ్చని మానిటరింగ్ పాలసీ అంచనా వేసింది. దీన్ని 9.5 శాతానికి కుదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం-26.2, రెండో త్రైమాసికం-8.3, మూడో క్వార్టర్లో 5.4, చివరి త్రైమాసికానికి 6.2 శాతం నిర్ధారించగా.. తాజాగా దాన్ని సవరించింది. తొలి త్రైమాసికం-18.5, రెండో త్రైమాసికం-7.2, మూడో క్వార్టర్లో 7.2, చివరి త్రైమాసికానికి 6.6 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు నమోదవుతుందని అంచనా వేసింది.
ఈ అంచనాలతో నీతి ఆయోగ్ ఏకీభవించట్లేదు. వృద్ధిరేటు అధికంగా ఉంటుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల అంటే జూన్ నుంచే వృద్ధిరేటు పురోగమిస్తుందని చెప్పారు. జులై నాటికి పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు. ఒక్కసారి జీడీపీ వేగం పుంజుకోవడం ఆరంభమైన వెంటనే తాము.. ఆర్బీఐ మానిటరింగ్ పాలసీని పునఃసమీక్షిస్తామని ఆయన కుండబద్దలు కొట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ రేటు అనూహ్యంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కొద్దిసేపటి కిందటే ఆయన తన జీడీపీ వృద్ధి రేటు అంచనాలను న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐతో పంచుకున్నారు.
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్బ్యాంక్.. జీడీపీ వృద్ధి రేటును 10.5 శాతం నుంచి 9.5 శాతానికి కుదించిందని గుర్తు చేశారు. ఇది తొలి త్రైమాసికంపై ప్రభావాన్ని చూపుతుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎకానమి వృద్ధిరేటు అంచనాల కంటే తక్కువగానే ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ- జులై నుంచి వేగం పుంజుకుంటుందని, 10 నుంచి 10.5 శాతం మేర జీడీపీ వృద్ధి రేటు నమోదు అవుతుందని ఆయన పేర్కొన్నారు.