చైనా తర్వాత అందుకే హైదరాబాద్లోనే ఒప్పో ఇన్నోవేషన్ ల్యాబ్
భారత్లోనే మొట్టమొదటి 5G ఇన్నోవేషన్ ల్యాబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో మొబైల్ టెలీ కమ్యూనికేషన్స్ లిమిటెడ్. ఇప్పటికే ఉన్న పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో దీనిని ప్రారంభించినట్లు రెండు రోజుల క్రితం తెలిపింది. చైనా తర్వాత తమ సంస్థ విదేశాల్లో ఏర్పాటు చేసిన మొదటి ఇన్నోవేషన్ ల్యాబ్ ఇదేనని, ప్రపంచవ్యాప్తంగా 5G అభివృద్ధిని దీని ద్వారా వేగవంతం చేయనున్నట్లు తెలిపింది. భారత్తో పాటు మిడిల్ ఈస్ట్ ఏషియా, దక్షిణాసియా, ఆఫ్రికా, జపాన్, ఐరోపా దేశాలకు చెందిన ఆవిష్కరణలను ఇక్కడే కొనసాగిస్తామని తెలిపింది.
చైనా తర్వాత హైదరాబాద్లోనే...
డ్రాగన్ దేశానికి చెందిన ఒప్పో చైనాకు వెలుపల ఓ ఇన్నోవేషన్ హబ్ను స్థాపించడం ఇదే తొలిసారి. దీంతో పాటు త్వరలో మరో మూడు ప్రయోగశాలలను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు ఒప్పో తెలిపింది. హైదరాబాద్లోని పరిశోధన, అభివృద్ధి సంస్థలో నూతన ఆవిష్కరణల కోసం మొబైల్ ఫోన్ల కెమెరా, పవర్, బ్యాటరీ పనితీరును మెరుగుపరిచే మూడు క్రియాశీలక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
ఎంతోమందికి ఉద్యోగాలు
భారత్ను సాంకేతిక కేంద్రంగా మార్చడానికి, సరికొత్త, ఆధునాతన పరిజ్ఞానాలను రూపొందించేందుకు ఇది దోహదపడుతుందని ఒప్పో ప్రతినిధి తస్లీమ్ అరీఫ్ తెలిపారు. ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ ద్వారా తెలంగాణలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్కు ఉద్యోగాలు లభిస్తాయి.
అందుకే హైదరాబాద్
5జీ ఇన్నోవేషన్ ల్యాబ్... టెక్నాలజీ లీడర్లు, వైర్ లెస్ సేవల సంస్థలు, డెవలపర్లు, టెల్కో సంస్థల కోసం ఏర్పాటు చేసే గ్లోబల్ ఎకో సిస్టం. 5జీ శక్తి సామర్థ్యాలను అధ్యయనం చేసి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా దానిని రూపాంతరం చెందిస్తారు. హైదరాబాద్కు దిగ్గజ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఇక్కడి మౌళిక సదుపాయాలు అంతర్జాతీయ సంస్థల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో హైదరాబాద్కు ఒప్పో మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.