Oppo India: Oppo మెుబైల్స్ ఆర్థిక కుంభకోణం.. వేల కోట్ల పన్నుల ఎగవేత.. కస్టమ్స్ అధికారులకు తప్పుడు సమాచారం..
Oppo India: చైనా కంపెనీల పన్ను ఎగవేత అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చైనీస్ స్మార్ట్ఫోన్ ఒప్పో భారతీయ యూనిట్ను శోధించింది. దీనిలో Oppo ఇండియా రూ.4,389 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించింది. గత వారం చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వివో భారీ 'హవాలా' లావాదేవీలకు పాల్పడినట్లు తేలిన విషయం తెలిసిందే. హవాలా ద్వారా రూ.62,476 కోట్లను చైనాకు అక్రమంగా తరలించినట్లు ఈడీ గుర్తించింది.
కస్టమ్స్ అధికారులకు తప్పుడు వివరాలు..
డీఆర్ఐ అధికారులు ఒప్పో ఇండియా కార్యాలయాలతో పాటు, కీలక ఉద్యోగుల నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దిగుమతులకు సంబంధించి కంపెనీ కస్టమ్స్ అధికారులకు తప్పుడు వివరాలను అందించటం ద్వారా రూ.2,981 కోట్ల పన్ను మినహాయింపులను అక్రమంగా పొందినట్లు అధికారులు గుర్తించారు.
చైనాలో కంపెనీలకు చెల్లింపులు..
యాజమాన్య సాంకేతికత/బ్రాండ్/IPR లైసెన్స్కు బదులుగా చైనాలోని పలు బహుళజాతి కంపెనీలకు 'రాయల్టీ', 'లైసెన్స్ ఫీజు' చెల్లింపు కోసం Oppo ఇండియా చెల్లింపులు / కేటాయింపులు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని DRI తెలిపింది.కస్టమ్స్ చట్టం- 1962లోని సెక్షన్- 14ను ఉల్లంఘిస్తూ.. Oppo ఇండియా చెల్లించిన 'రాయల్టీ', 'లైసెన్స్ ఫీజు' వారు దిగుమతి చేసుకున్న వస్తువుల లావాదేవీ విలువలో కలపలేదని తేలింది.
ఈ ప్రకారం Oppo ఇండియా ఈ ఖాతాలో రూ.1,408 కోట్ల సుంకం ఎగవేసినట్లు DRI ఆరోపించింది. ఇలా మెుత్తం లెక్కగట్టగా ఒప్పో ఇండియాకు కస్టమ్స్ సుంకం మెుత్తం ఎగవేత రూ.4,389 కోట్లని అధికారులు తేల్చారు.
గత వారం..
వివో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి దాని 23 అనుబంధ కంపెనీలకు చెందిన 48 ప్రదేశాల్లో, ఇప్పటివరకు రూ.465 కోట్ల గ్రాస్ బ్యాలెన్స్ ఉన్న వివిధ సంస్థల 119 బ్యాంక్ ఖాతాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. వివో ఇండియాకు చెందిన రూ.66 కోట్ల ఎఫ్డిలతో సహా 2 కిలోల బంగారు కడ్డీలతో పాటు సుమారు రూ.73 లక్షల నగదు పీఎంఎల్ఎ నిబంధనల ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.