కరోనా దెబ్బ: స్విగ్గి, జొమాటో లకు కొత్త తలనొప్పి!
కరోనా వైరస్ దెబ్బతో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. కేవలం అత్యవసర సరుకుల విక్రయం లో నిమగ్నమైన సంస్థలు మాత్రం ఈ ప్రభావాన్ని తట్టుకొని నిలబడగలిగాయి. కానీ, అదే సెగ్మెంట్లో ఉన్న ఫుడ్ డెలివరీ సంస్థలు మాత్రం దెబ్బతింటున్నాయి. 21 రోజుల లాక్ డౌన్ తో హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కానీ, ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ చేయటం, పార్సెల్ టేక్ అవే లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనాల ఆహార అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటికే కొంత దెబ్బతిన్న ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గి కొంత ఊపిరి పీల్చుకున్నాయి. లాక్ డౌన్ ప్రారంభంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ ను పోలీసులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయా సంస్థల డెలివరీ లు ప్రభావితం అయ్యాయి. కానీ గత 10 రోజులుగా స్విగ్గి, జొమాటో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే, వాటికి ఇప్పుడో కొత్త చిక్కొచ్చి పడింది. సేవలు అందించేందుకు అవి ముందుకు వస్తున్నా ... అటు వినియోగదారులు, ఇటు రెస్టారెంట్ల నుంచి సరైన మద్దతు లభించటం లేదు.
షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?
70% పడిపోయిన ఆర్డర్లు...
ఇండియాలో ఐదేళ్ల క్రితం ఫుడ్ డెలివరీ మొదలైనప్పుడు అదో వింతగా చూశారంతా. కొన్నాళ్ళకు ఆన్లైన్ లో ఆర్డర్ చేయటం చాలా సహజం అయిపోయింది. ఇక 2020 వచ్చే నాటికి ఇంటి భోజనం కంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసేందుకే నగరవాసులు ఎక్కువ ఆసక్తి చూపారు. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గి, జొమాటో లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. వాటి వృద్ధి చూసి రూ వేల కోట్లలో ఆయా కంపెనీల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ఈ సంస్థలు రోజుకు సుమారు 30 లక్షల ఆర్డర్ల ను డెలివరీ చేసే స్థాయికి ఎదిగాయి. అయితే, కరోనా పుణ్యమా అని ప్రస్తుతం జొమాటో, స్విగ్గి ల ఆర్డర్లు సుమారు 70% పడిపోయాయి. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన గత 10 రోజుల్లోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఈటీ పేర్కొంది.
కస్టమర్లు నో...
ఒకప్పుడు ఎగబడి మరీ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసిన వినియోగదారులు ఇప్పుడు అందుకు నో చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫుడ్ పరిశుభ్రత పై వారిలో నెలకొన్న అనుమానాలే ఇందుకు కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లు టేక్ అవే లకు ఓకే చెబుతున్నా అందులో వంట చేసే పరిసరాలు ఎలా ఉన్నాయో, అక్కడ తగిన పరిశుభ్ర వాతావరణం ఉందొ లేదో, ఇంకా వంట చేసే వారికి పొరపాటున కరోనా సోకి ఉంటే ఎలా అనే అనుమానాలు వారిని తొలిచివేస్తున్నాయి. అందుకే కస్టమర్లు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఇష్టపడటం లేదని విశ్లేషిస్తున్నారు. మరో వైపు అందరూ ఇంటికే పరిమితం అవుతున్నారు కాబట్టి, తగినంత ఫ్రీ టైం దొరకడంతో ఎవరికి వారే ఫుడ్ ప్రిపేర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం విపరీతంగా యూట్యూబ్ ఛానల్ పై ఆధారపడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
తగ్గిన రెస్టారెంట్లు...
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మంచి జోరు మీద ఉన్నప్పుడు లక్షలాది హోటల్స్, రెస్టారెంట్లు స్విగ్గి, జొమాటో ప్లాట్ ఫార్మ్స్ పై ఆధారపడేవి. ఒకవైపు తమ వ్యాపారం చేసుకుంటూనే.. మరోవైపు ఆన్లైన్ లో కూడా ఆర్డర్లను తీసుకునేవి. తమకు ఆర్డర్లు ఇస్తూ, వాటిని డెలివరీ చేసిపెట్టినందుకు గాను స్విగ్గి, జొమాటో లకు 15% నుంచి 25% వరకు కమిషన్ చెల్లిస్తుండేవి. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కేవలం టేక్ అవే లపై ఆధారపడి వ్యాపారం కొనసాగించటం కష్టం కాబట్టి, చాలా హోటల్స్ వాటిని పూర్తిగా మూసివేశాయి. కొన్ని మాత్రం పాక్షికంగా నడుస్తున్నాయి. ఇలా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆప్ ల లో నమోదైన హోటల్స్ లో ప్రస్తుతం మూడో వంతు కూడా పనిచేయటం లేదు. దీంతో స్విగ్గి, జొమాటో లకు కొత్త చిక్కొచ్చి పడింది. అటు వినియోగదారులు ఆర్డర్ చేసేందుకు ఇష్టపడటం లేదు, ఇటు రెస్టారెంట్లు లేవు. ఇక ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో అవి కూరగాయలు, గ్రోసరీలు డెలివరీ చేసే పనిలో నిమగ్నమయ్యాయి.