Covid 19: మోడీ ప్రభుత్వానికి ఊహించని లాభం, నిర్మల ప్యాకేజీ కంటే డబుల్
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పేదలు, వ్యాపారులు, ఉద్యోగాలు లేని వారు.. ఇలా వివిధ వర్గాలు ఆకలితో ఉండకుండా ఉచిత బియ్యం, జన్ ధన్ అకౌంట్లో రూ.500, ఉచిత గ్యాస్ సిలిండర్ను మూడు నెలల పాటు ఇస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. 80 కోట్ల మంది పేదలకు ప్రయోజనం కల్పించింది కేంద్రం. ఇదే సమయంలో చమురు ధరలు కూడా క్రమంగా తగ్గాయి. ఇది కేంద్రానికి లాభించింది.
జీరో కంటే తక్కువకు చమురు ధరలు, పెట్రోల్కు మనం డబ్బులు చెల్లించవద్దా?
భారీగా సమకూరిన ఆదాయం
జనవరి తర్వాత నుండి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఓ రకంగా ఇది ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో సమకూరినట్లే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయినట్లుగా మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. దీంతో ప్రభుత్వానికి దాదాపు హెల్త్ బడ్జెట్కు నాలుగు రెట్ల మొత్తం జమకూరి ఉంటుందని అంటున్నారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) మే కాంట్రాక్ట్ నిన్న ఏకంగా జీరో డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. చమురు ధరలు పడిపోవడం మన ఎకానమీకి కొంత ప్రయోజనమే.
చమురుకు కేటాయింపు.. ధరలు
భారతీయ ముడి చమురు నేరుగా అమెరికా WTIతో సంబంధం లేదు. ఏదేమైనా చమురు ధరలు తగ్గుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యారెల్కు 66 డాలర్ల చొప్పున క్రూడ్ ఇంపోర్ట్ బిల్లును 105 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. అంతకుముందు ఉన్న ధరల ఆధారంగా క్రూడ్కు ఎంత ఖర్చవుతుందో అంచనా వేస్తారు. 2019 డిసెంబర్లో 69 డాలర్లు, 2020 జనవరిలో 64 డాలర్లుగా ఉంది. ఈ లెక్కన అంచనా వేస్తారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో ధరలు పాతాళానికి దిగివచ్చాయి.
40 బిలియన్ డాలర్ల బిల్లు తగ్గుతుంది
క్రూడాయిల్ ధరలు ఫిబ్రవరిలో 56 డాలర్లు, మార్చిలో 32 డాలర్లకు పడిపోయాయి. ఏప్రిల్లో ఏకంగా 21 డాలర్లకు దిగజారాయి. ఈ లెక్కన సగటున చూస్తే 40 డాలర్లకు అటు ఇటుగా ఉండవచ్చు. అప్పుడు మన ఇంపోర్ట్ బిల్స్ 64 బిలియిన్ డాలర్లు అవుతుంది. అంటే దిగుమతి బిల్లులో 40 బిలియన్ డాలర్లు తగ్గుతుంది. అంటే ఇక్కడి డిమాండ్తో సంబంధం లేకుండా ఇది ఉంటుంది. అంటే ప్రభుత్వానికి అదనంగా రావడం కాదు. కానీ క్రూడ్కు కేటాయించిన మొత్తంలో ఖర్చు తగ్గి మిగులుతుంది.
ప్యాకేజీ కంటే దాదాపు డబుల్.. హెల్త్ బడ్జెట్ కంటే నాలుగింతలు
ఇక, కరోనా మహమ్మారిపై పోరాటానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం 23 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీ కంటే చమురు ద్వారా మిగిలిన మొత్తమే 40 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రెండు రెట్లు. ఈ సంవత్సరం మన హెల్త్ బడ్జెట్ 69,000 కోట్లు. దాదాప 9 బిలియన్ డాలర్లు. అంటే చమురు ధరలు పడిపోవడం వల్ల మన హెల్త్ బడ్జెట్ కంటే 4 రెట్లు ఆదా అయింది. ప్రభుత్వానికి ఇది అనుకోని విధంగా వచ్చిన లేదా మిగిలిన భారీ ఆదాయం.