136కు తగ్గిన భారత కుబేరులు, ఈ 22 స్టార్టప్స్ భవిష్యత్తు అదుర్స్
దేశంలో కుబేరుల సంఖ్య 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో స్వల్పంగా తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో భారత్లో బిలియనీర్లు 141 ఉండగా, FY21లో ఈ సంఖ్య 136కు తగ్గింది. అంటే అంతకుముందు ఏడాది కంటే 5గురు తగ్గారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు వెల్లడించారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు సమయంలో రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని వెల్లడించిన వ్యక్తులను ఈ జాబితాలో చేరుస్తారు.
2018-19లో 77 మంది బిలియనీర్లు, గత సంవత్సరానికే దాదాపు రెండింతలయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5గురు తగ్గినప్పటికీ, మూడేళ్ల క్రితంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. 2016 నుండి సంపద పన్నును రద్దు చేయడంతో ఈ కుబేరుల పూర్తి సంపద వివరాలు సీబీడీటీ వద్ద లేవని తెలిపారు.
ఆ సమాచారం లేదు
డైరెక్ట్ ట్యాక్సెస్ కింద బిలియనీర్ల పదానికి డెఫినేషన్ ఏదీ సీబీడీటీ వద్ద లేదని, ఎందుకంటే 2016లో వెల్త్ ట్యాక్స్ను రద్దు చేయడంతో పూర్తి సమాచారంను సీబీడీటీ సేకరించడం లేదని నిర్మలమ్మ తెలిపారు. పేదరికం గురించి మాట్లాడుతూ... టెండూలర్కర్ కమిటీ మెథడాలజీ ప్రకారం దేశంలో 2011-12 నాటికి 27 కోట్ల మంది బిలో పావర్టీ లైన్(BPL) కింద ఉన్నట్లు తెలిపారు. దేశంలో ధరల పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికి అప్పుడు పరిశీలిస్తోందని, ధరల స్థిరీకరణ కోసం తగిన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించామని గుర్తు చేశారు. పప్పు ధాన్యాల నిల్వలపై పరిమితి విధించామన్నారు. డిమాండ్-సరఫరాలను జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నట్లు వెల్లడించారు. జూలై 15వ తేదీ నాటికి మొత్తం 1.33 లక్షల మందికి కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ బ్యాంకులు అన్-సెక్యూర్డ్ లోన్లను ఇచ్చాయన్నారు. PSBలు కరోనా లోన్ అందిస్తున్నాయని, వీటి కాల పరిమితి మూడేళ్ల నుండి అయిదేళ్లు ఉందని గుర్తు చేశారు. అలాగే ప్రారంభ రీపేమెంట్ మారటోరియం మూడు నుండి ఆరు నెలలు ఉన్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో మోసాలు కొంతమేర తగ్గినట్లు తెలిపారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో 2019-20లో 568 మోసాలు వెలుగు చూడగా, 2020-21లో ఆ సంఖ్య 323గా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర సహకార బ్యాంకుల్లో మోసాలు 508 నుండి 482కు తగ్గాయన్నారు.
22 స్టార్టప్స్కు అదిరిపేయో భవిష్యత్తు
ఇక, భారత కుబేరులు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఐదుగురు తగ్గగా, ఫోర్బ్స్ '100 టు వాచ్' జాబితాలో 22 భారత స్టార్టప్స్ చోటు దక్కించుకున్నాయి. ఇప్పటి స్టార్టప్స్లో మున్ముందు పెద్ద కంపెనీలుగా మారడానికి అవకాశమున్న సంస్థల జాబితాను రూపొందించి, '100 టు వాచ్' పేరిట ఫోర్బ్స్ జాబితాను రూపొందించింది.
గతంలో ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితా విడుదల చేసేది. తొలిసారి ఆసియా ఫసిఫిక్ దేశాల్లోని 100 సంస్థలను గుర్తించి, ఫోర్బ్స్ జాబితాను రూపొందించింది. మొత్తం పది రంగాల్లోని సంస్థల నుండి వీటిని ఎంపిక చేసింది. టెక్నాలజీ, హెల్త్, ఇ-కామర్స్-రిటైల్, ఫుడ్-హాస్పిటాలిటీ, విద్య-నియామకాలు, నిర్మాణం-ఇంజినీరింగ్, వ్యవసాయం, ట్రాన్సుపోర్ట్, ఫైనాన్స్, వినోదం, మీడియా రంగాలు ఉన్నాయి.
మొత్తం జాబితాలో చైనా, దక్షిణ కొరియా, మలేషియా, ఆస్ట్రేలియా సహా 17 దేశాల సంస్థలు ఉన్నాయి. ఇందులో భారత్ నుండి 22 సంస్థలు ఉన్నాయి. మన దేశం నుండి ఎక్కవగా వ్యవసాయం, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ స్టార్టప్స్ ఉన్నాయి.
ఆ జాబితా ఇదే
టాప్ 22 జాబితాలో ఉన్న స్టార్టప్స్ ఇవే... అక్వా కనెక్ట్, బీట్ఓ, బెల్లాట్రిక్ ఏరోస్పేస్, బెటర్ ప్లేస్, బ్రిక్ అండ్ బోల్ట్, కెప్టెన్ ఫ్రెష్, కాన్వోసైట్ అనలటిక్స్, డ్రింక్ ప్రైమ్, ఎంట్రీ సాఫ్టువేర్, ఫసల్, గేమ్ జాప్, గ్రామోఫోన్, ఐ2ఈ1, లాగ్, మెటిరీయల్స్, మేకర్స్ హైవ్, ఓయ్ రిక్షా, ప్లానిస్ టెక్నాలజీస్, జెన్స్ ల్యాబ్స్, సర్వ్, ట్రూమోడ్స్, టర్బిల్ షెల్ టెక్నాలజీస్, వాదం ఇండియా ఉన్నాయి.