Moonlighting: మూన్లైటింగ్ పరిష్కారానికి చర్చలే సరైన మార్గం.. పారదర్శకత తప్పనిసరి..
Moonlighting: మూన్ లైటింగ్ వివాదం ఐటీ కంపెనీల్లో కల్లోలం సృష్టిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో కొన్ని కంపెనీలు సపోర్ట్ చేస్తుండగా.. మరికొన్ని కంపెనీలు మాత్రం అందుకు పూర్తిగా నిరాకరణను తెలియజేస్తున్నాయి. ఇటీవల విప్రో 300 మందిని తొలగించటంతో ఈ విషయం చర్చలకు దారితీస్తోంది. టీసీఎస్ లాంటి కంపెనీలు ఇది నైతికతకు సంబంధించిన విషయమని వెల్లడించింది. కాగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు సైడ్ గిగ్ లకు ఒకే చెబుతున్నా.. అందుకు కొన్ని షరతులు పెట్టాయి.
ఇదే విషయంపై ఎన్టీటీ ఇండియా సీఈవో అవినాష్ జోషి ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన అభిప్రాయాన్ని వెల్లడించిన జోషి దీనికి కంపెనీతో సంబంధం లేదని స్పష్టంగా వెల్లడించారు. మూన్ లైటింగ్ లాంటి మారుతున్న ట్రెండ్లను మనందరం గమనించాలని అన్నారు. ఇలాంటివి జరగటం సర్వ సాధారణమేనని.. అయితే ఇలాంటివి వారి వ్యక్తిగత ఆసక్తి లేదా వారి అవసరాల వల్ల ఉద్యోగులు చేస్తుంటారని అన్నారు. తమ జీవితంలో అవసరాలను సపోర్ట్ చేసుకునేందుకు ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని చెప్పారు. అయితే ఇక్కడ ప్రయోజనాల సంఘర్షణ ప్రధానమని తాను భావిస్తున్నానని జోషి పేర్కొన్నారు.
మారుతున్న ట్రెండ్స్ గురించి ఐటీ పరిశ్రమలో ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికే ఉన్న నైపుణ్యాలు ఇప్పటికీ డిమాండ్లో ఉంటాయన్నారు. ఇలాంటి వాతావరణంలో ఐటీ ఉద్యోగులు రెండవ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నట్లయితే.. దాని గురించి ముందుగా ప్రస్తుత యాజమాన్యాలకు తప్పక వెల్లడించాలని స్పష్టం చేశారు. ఈ సమస్యకు ఉద్యోగులు యాజమాన్యాలకు మధ్య చర్చలే పరిష్కారాన్ని అందిస్తుందని అన్నారు. కంపెనీలు సైతం తమ పాలసీలను రూపొందించే ముందు తమ ఉద్యోగులతో అన్ని విషయాలపై చర్చించాలని అభిప్రాయపడ్డారు.
(గతంలో మూన్ లైటింగ్ గురించి ప్రచురించిన ఈ వార్తలో కొన్ని పొరపాట్లు దొర్లాయి. NTT Data CEO అవినాష్ జోషి ఫోటోకు బదులుగా మరో వ్యక్తి ఫోటోను పొరుపాటున ప్రచురించడం జరిగింది. ఆ తప్పును సవరించడం జరిగింది. మా పొరపాటును ఎన్టీటీ డేటా సీఈఓ అవినాష్ జోషి మన్నించాలని కోరుకుంటున్నాం. పాఠకులు కూడా ఈ విషయాన్ని గమనించి మన్నించాలని విజ్ఞప్తి)