stock market: ఆ విభాగంలో ట్రేడింగ్ వేళల పొడిగింపు నేటి నుంచే.. మరి ప్రతిరోజూనా అంటే ?
stock market: భారతీయ స్టాక్ మార్కెట్ ప్రపంచంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు కొత్త నింబధలను అమల్లోకి తెస్తూ ఉంటుంది. ఇటీవలే ట్రేడింగ్ సెటిల్ మెంట్ సమయాన్ని తగ్గించింది. తద్వారా ఇన్వెస్టర్లను ఇండియన్ ఈక్విటీస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా మరో అడుగు ముందుకు వేసి ట్రేడింగ్ వేళలను పొడిగిస్తూ NSE నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ప్రతిరోజూ వర్తిస్తుందా, లేదా తెలుసుకుందాం..
మరో 90 నిమిషాలు అదనం:
వడ్డీ రేటు డెరివేటివ్ ల ట్రేడింగ్ ను సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఓ సర్క్యులర్ జారీ చేసింది. అది నేటి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు జరుగుతున్నాయి. అంటే రోజులో 6.30 గంటలన్నమాట. అయితే ఈరోజు నుంచి అందుకు అదనంగా మరో 1.30 గంటల పాటు ట్రేడింగ్ కొనసాగుతుందని వెల్లడించింది.
కేవలం ఆ ఒక్కరోజే..
మారిన నిబంధనల మేరకు, ప్రస్తుత నెలవారీ ఒప్పందాల ముగింపు రోజైన(ఎక్స్ పైరీ డే) ఫిబ్రవరి 23న సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్ జరిపేందుకు ఎక్స్ఛేంజ్ నిర్ణయించింది. అయితే ఇతర వడ్డీ రేటు డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్ వేళల్లో ఎటువంటి మార్పు ఉండదు అని స్పష్టం చేసింది. ఈరోజు నుంచి ప్రతి కాంట్రాక్టు ఎక్స్ పైరీ రోజున సాధారణ సమయానికి అదనంగా మరో 90 నిమిషాలపాటు మార్కెట్లు కొనసాగుతాయని పేర్కొంది. ఫైనల్ సెటిల్మెంట్ ప్రైస్ లెక్కించే విధానం ఎప్పటిలానే ఉంటుందని వెల్లడించింది.
సమస్యలు తప్పవు:
తాజా నిబంధనల గురించి ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ Zerodha CEO నితిన్ కామత్ ట్విట్టర్లో స్పందించారు. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో పెట్టుబడిదారుల భాగస్వామ్యం తగ్గుతుందని, లిక్విడిటీ సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. క్రియాశీలక రిటైల్ F&O ట్రేడర్ల మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందన్నారు. ఎక్కువ సమయం లాభ, నష్టాలను ట్రాక్ చేయడం తీవ్ర ఒత్తిడితో కూడినదని గుర్తు చేశారు. సాధారణ జీవన విధానంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.
అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానంగా..
నిబంధనల మార్పు వల్ల హెడ్జింగ్ రిస్కు తగ్గుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకోవడానికి తగినంత సమయం దొరుగుతుందని అనుకుంటున్నారు. ఇతర దేశాల మార్కెట్లు తెరుచుకునే వేళ వరకు ఇండియన్ మార్కెట్లు పనిచేస్తే ట్రేడింగ్ మరింత ప్రభావవంతంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈక్విటీల సమయాన్ని పొడిగించాలనే డిమాండ్ పరిశీలనో ఉండగా.. అందుకు అనుగుణంగా తాజా నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు చెబుతున్నారు.