జీఎస్టీపై కేంద్రం 2 ఆప్షన్లు: రుణం తీసుకోవాలని ఒత్తిడి.. బీజేపీయేతర రాష్ట్రాల అసంతృప్తి
కరోనా మహమ్మారి కారణంగా జీఎస్టీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35 లక్షల కోట్ల మేర లోటు ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.3 లక్షల కోట్లు జీఎస్టీ పరిహారం కింద చెల్లించాల్సి ఉంది. కానీ రూ.65వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ముందు కేంద్రం రెండు ప్రతిపాదనలు పెట్టింది. ఆర్బీఐ నుండి తక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం ఒకటి, రూ.2.35 లక్షల కోట్లను ప్రత్యేక ఏర్పాటు ద్వారా రూపొందించడం రెండోది. ఈ ప్రతిపాదనలపై వారం రోజుల్లో రాష్ట్రాలు తమ అభిప్రాయం తెలియజేయాలి. ఈ లోటులో జీఎస్టీది రూ.97 వేల కోట్లు కాగా, మిగతాది కరోనా ప్రభావం వల్ల జరిగిన లోటు.
జీఎస్టీ పరిహారం: కేంద్రమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు ఇస్తే బెట్టర్!
రేపు ఉమ్మడి కార్యాచరణ
కేంద్రం రెండు ప్రతిపాదనల పట్ల బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ మేరకు సోమవారం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రణాళికలను వ్యతిరేకిస్తూ సమైక్యంగా ఓ వ్యూహాన్ని రూపొందించనున్నాయి. ఏప్రిల్ 2020 నుండి జనవరి 2021 నాటికి రూ.3 లక్షల కోట్ల మేర జీఎస్టీ ఆదాయం తగ్గనుందని, రాష్ట్రాల వాటాగా రూ.97వేల కోట్లను రుణం తీసుకునేందుకు అంగీకరించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.
రుణాల కోసం ఒత్తిడి
కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం ప్రతిపాదించిన రెండు ప్రణాళికల్లో మొదటి దానిని ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిని తాము అధ్యయనం చేస్తున్నామని, కరోనా వల్ల దెబ్బతినడంతో రాష్ట్రాలతో పాటు కేంద్రంపై కూడా భారీ ఆర్థిక ఒత్తిడి ఉంటుందని గుర్తించాలని, అధిక రక్షణ వ్యయం, ఇతర అవసరాలు కూడా ఉన్నాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ గుర్తు చేశారు. అయితే బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలు రుణభారాన్ని కేంద్రం చేపట్టాలని కోరుకుంటున్నాయి. తమ రుణ పరిమితి తక్కువగా ఉంటుందని చెబుతున్నాయి. రుణాలు తీసుకోవడానికి తాము అనుకూలగా లేమని, అప్పులు తీసుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, సోమవారం తాము దీనిపై చర్చిస్తామని చత్తీస్గఢ్ మినిస్టర్ టీఎస్ సింగ్ దేవ్ అన్నారు.
రెండు మార్గాలు ఇవీ...
జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన రూ.97వేల కోట్ల నష్టాన్ని ఆర్బీఐతో సంప్రదించి స్పెషల్ విండో ద్వారా రాష్ట్రాలకు అందించే ఏర్పాటు చేస్తుంది కేంద్రం. వడ్డీతో ఈ మొత్తాన్ని 2022 జూలై తర్వాత పరిహార సెస్ నిధి నుండి చెల్లిస్తుంది. కేంద్రం ఆర్బీఐని సంప్రదించి రాష్ట్రాలకు రుణం ఇప్పిస్తుంది. అప్పుడు రాష్ట్రాలు మార్కెట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆత్మనిర్భర్ భారత్ కింద ఇదివరకు ప్రకటించిన 0.5 శాతానికి ఇది అదనం. ఈ మొదటి మార్గాన్ని ఎంచుకుంటే 2022 జూన్ వరకు రావాల్సిన పరిహారానికి రక్షణ ఉంటుంది. ఆ మొత్తాన్ని 2022 తర్వాత పొందవచ్చు. ఆ తర్వాత కూడా సెస్ నిధి కొనసాగుతుంది. ఇప్పుడు మార్కెట్ నుండి క్కువ మొత్తం పొందిన వారికి 2022 తర్వాత సెస్ నుండి పరిహారం అందిస్తారు. రూ.97వేల కోట్ల రుణ ప్రతిపాదన ప్రకారం కార్లు, శీతల పానియాలు, పాన్ మసాలా, పొగాకు, బొగ్గుపై పరిహారం సెస్ నుండి మొత్తం ప్రిన్సిపల్, వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. ఇది ప్రస్తుత జూన్ 2022 గడువుకు మించి పొడిగిస్తుంది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు రుణాలు లభిస్తాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేటుతో వారి బ్యాలెన్స్ షీట్లో అప్పును జత చేస్తారు. రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
రాష్ట్రాలకు కేంద్రం చూపించిన రెండో మార్గం రూ.3 లక్షల కోట్ల రెవెన్యూ నష్టంలో సెస్ కింద వసూలయ్యే రూ.65వేల కోట్లు పోను మిగిలిన రూ.2.35 లక్షల కోట్లను రాష్ట్రాలు ఆర్బీఐ ద్వారా సేకరించాలి. దీనికి కేంద్రం సహకారం ఉంటుంది. దీనిని ఎంచుకుంటే ఎఫ్ఆర్బీఎంలో 0.5 శాతం అదనపు వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు అధిక మొత్తం రుణంగా పొందిన రాష్ట్రాలకు 2022 తర్వాత సెస్ నిధి నుండి పరిహారం పెంపు ఉండదు. ఈ రెండింట్లో రాష్ట్రాలు దేనిని ఎంచుకున్నా ఆ మొత్తాన్ని రాష్ట్రాలు చెల్లించవు. పూర్తిగా పరిహార సెస్ నుండి చెల్లిస్తారు.