పీఎఫ్ ఖాతా నుండి డబ్బు తీసుకుంటే ట్యాక్స్ లేదు, 10 రోజుల్లోనే రూ.280 కోట్లు విత్డ్రా
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. అవసరాల నిమిత్తం ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా నుండి నగదును ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వెసులుబాటు కల్పించింది. దేశంలోని అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ క్యాష్ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

10 రోజుల్లో భారీ ఉపసంహరణలు
కరోనా మహమ్మారి కారణంగా ఈపీఎఫ్ విత్ ఉపసంహరించుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో గత పది రోజుల్లోనే దాదాపు 1.37 లక్షల మంది క్లెయిమ్స్ పరిష్కరించినట్లు ఈపీఎఫ్ఓ శుక్రవారం తెలిపింది. 21 రోజుల లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు సహకారంగా ఉంటుందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.

రూ.279.65 కోట్ల చెల్లింపు
KYC వివరాలు నిబంధనల మేరకు ఉన్న వారి అప్లికేషన్స్ను 72 గంటల్లోగా ప్రాసెస్ చేస్తున్నట్లు ఈపీఎఫ్వో తెలిపింది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న సబ్స్క్రైబర్లకు ఇప్పటి వరకు రూ.279.65 కోట్ల మొత్తం చెల్లించినట్లు తెలిపింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఈపీఎఫ్ పథకం నుండి ప్రత్యేక ఉపసంహరణకు కేంద్రం అనుమతించింది.

ఉపసంహరణపై పన్ను ఉండదు
సాధారణంగా ఐదేళ్ల కంటే ముందు ఈపీఎఫ్ నుండి నగదు ఉపసంహరించుకుంటే పన్ను విధిస్తారు.అయితే మెడికల్ ఎమర్జెన్సీ, ఉద్యోగం మానివేయడం లేదా యజమాని బిజినెస్ నిలిపివేయడం వంటి సందర్భాల్లో మాత్రమే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈపీఎఫ్ అకౌంట్ నుండి నగదును ఉపసంహరించుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. కరోనా కారణంగా డబ్బులు తీసుకున్నా పన్ను ఉండదు.

ఎంత ఉపసంహరించుకోవచ్చు
మీరు మూడు నెలల వేతనం (బేసిక్ శాలరీ) లేదా మీ పీఎఫ్ ఖాతాలోని 75 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇందులో ఏది తక్కువగా ఉంటే దానినే విత్ డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.3 లక్షలు ఉందని అనుకుందాం. మీ బేసిక్ శాలరీ నెలకు రూ.30,000 అనుకుంటే మూడు నెలలకు రూ.90,000 అవుతుంది. ఈఫీఎఫ్ ఖాతా ప్రకారం రూ.3 లక్షల్లో 75 శాతం రూ.2.25 లక్షలు, వేతనం ప్రకారం రూ.90,000 ఉపసంహరణ అవకాశముంది. ఇక్కడ ఏది తక్కువైతే అధే కాబట్టి రూ.90,000 మాత్రమే ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది.


Click it and Unblock the Notifications