డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటన.. మైక్రోసాఫ్ట్, FB, గూగుల్ సహా కుప్పకూలిన స్టాక్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ప్యాకేజీపై చేసిన ప్యాకేజీ ప్రకటన మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. ఎన్నికలకు ముందు ఆర్థిక ప్యాకేజీ లేదని ప్రకటించడంతో స్టాక్స్ కుప్పకూలాయి. ముఖ్యంగా ఎయిర్లైన్స్ స్టాక్స్ ఎక్కువగా దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ ప్రభావం నుండి వ్యాపారస్తులు, ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రకటించాలనుకున్న ఉద్దీపన పథకంపై డెమోక్రాట్లతో చర్చలు నిలిపివేయాలని ట్రంప్ ఆదేశించారు. స్పీకర్ నాన్సీ పెలోసీకి తమ ఆర్థిక ప్యాకేజీపై ఏమాత్రం విశ్వాసం లేదన్నారు.
తగ్గిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్, బెంగళూరు టాప్, రెండో స్థానంలో హైదరాబాద్
కుప్పకూలిన అమెరికా మార్కెట్లు
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరకు ఆర్థిక ప్యాకేజీపై చర్చలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించినట్లు ట్రంప్ ప్రకటించారు. గెలిచిన తర్వాత అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా భారీ ఉద్దీపన బిల్లును ప్రవేశ పెడతామని ట్రంప్ వెల్లడించారు. ప్యాకేజీపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో అమెరికా స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ప్యాకేజీ ఇప్పుడు లేదని తేలడంతో డౌజోన్స్ 378 పాయింట్లకు పైగా నష్టపోయింది. నాస్డాక్ 177 పాయింట్లు, ఎస్ అండ్ పీ 47 పాయింట్లు క్షీణించింది. డౌజోన్స్ ఓ సమయంలో 600 పాయింట్లు క్షీణించింది. అంతకుముందు రోజు ట్రంప్ కరోనా నుండి కోలుకొని ఆసుపత్రి నుండి వైట్ హోస్కు రావడంతో ప్యాకేజీ ప్రకటనపై ఆశలతో మార్కెట్లు లాభపడ్డాయి.
అందుకే మార్కెట్లు నష్టపోయాయి
స్పీకర్ నాన్సీ పెలోసీ కొన్ని రాష్ట్రాల కోసం ప్రతిపాదిస్తున్న 2.4 ట్రిలియన్ డాలర్ల బెయిలవుట్ కరోనా వినియోగం కోసం కాదని ట్రంప్ అన్నారు. తాము ఎంతో ఉదారంగా 1.6 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించామన్నారు. దీనికి డెమోక్రాట్లు అంగీకరించకపోవడంతో ఎన్నికలు ముగిసే వరకు చర్చలు నిలిపివేయాల్సిందిగా తమ ప్రతినిధులను ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఎన్నికల్లో గెలిచాక కష్టపడి పనిచేస్తున్న అమెరికన్లతోపాటు చిన్నవ్యాపారాలకు మేలు చేసేలా బెయిలవుట్ బిల్లును పాస్ చేస్తామన్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ప్యాకేజీ అవసరమని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ఇప్పుడు ప్యాకేజీ వాయిదా పడటంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీనపడి మార్కెట్లు నష్టపోయాయి.
స్టాక్స్ ఢీలా
కరోనా కారణంగా విమానయానం, ఆతిథ్య రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. నిన్నటి వరకు ప్యాకేజీపై ఆశలు పెట్టుకున్న ఎయిర్ లైన్ స్టాక్స్ ట్రంప్ ప్రకటన తర్వాత భారీగా దెబ్బతిన్నాయి. అలాగే టెక్ దిగ్గజాలు కూడా కుప్పకూలాయి. బోయింగ్, టెస్లా, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ డీలా పడ్డాయి. ఈ దిగ్గజ స్టాక్స్ 3 శాతం నుండి 1.5 శాతం మధ్య క్షీణించాయి. ఫార్మా దిగ్గజాలు కూడా పడిపోయాయి. మంగళవారం నాడు 11 రంగాల్లోని 10 రంగాలు నష్టాల్లో ముగిశాయి. కేవలం యుటిలిటీస్ మాత్రం 0.86 శాతం పెరిగింది.