ఇప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థకు ఊరట లేనట్లే!
భారత వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్లో 5 శాతానికి తగ్గింది. తదుపరి క్వార్టర్ జీడీపీ కూడా అంతకంటే తగ్గవచ్చునని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ఉద్ధీపన చర్యలు ప్రకటించింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రకటనలు చేసింది. అయితే ఈ ఉద్దీపన ప్రకటనలు ఇప్పటిప్పుడు డిమాండును తీసుకు రాకపోవచ్చునని, వినిమయాన్ని పెంచకపోవచ్చునని తెలిపారు.
గత రెండేళ్లుగా భారత వృద్ధి రేటు తగ్గుతోంది. వరుసగా అయిదో క్వార్టర్లో వృద్ధి రేటు తగ్గిపోయింది. ఇటీవల వృద్ధి రేటు 5 శాతంగా నమోదయింది. 2013లో ఇంత తగ్గుదల నమోదయింది. ఆ తర్వాత ఇదే కనిష్టం.
భారత వృద్ధి రేటు తదుపరి క్వార్టర్లో 4.7 శాతానికి తగ్గవచ్చునని రేటింగ్ ఏజెన్సీ ICRA అంచనా వేసింది. పెట్టుబడులు బలహీనత, డొమెస్టిక్ డిమాండ్ లేకపోవడం వల్ల వృద్ధి రేటు తగ్గుతుందని అభిప్రాయపడింది. మరోవైపు ఎస్బీఐ తదుపరి క్వార్టర్ వృద్ధి రేటును 4.2 శాతంగా అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో భారత్ పైనా ఈ ప్రభావం ఉంది. అయితే ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఉద్ధీపన చర్యలు ప్రకటించింది. బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్దీపన చర్యల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు పుంజుకుంటుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి.