ఆధార్కార్డు అప్గ్రేడ్: పాన్, ఈపీఎఫ్ఓ లింక్ కావట్లే: యూఐడీఏఐ ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుతో పాన్, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ను లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే తప్పనిసరి చేసింది. ఆధార్తో పాన్ కార్డ్ గానీ, ఈఫీఎఫ్ఓ గానీ లింకేజ్ లేకపోతే.. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం మొదలుకుని- బ్యాంకింగ్ సెక్టార్ సహా కొన్ని రకాల ఆర్థికపరమైన కార్యకలాపాలను నిర్వహించలేని పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు ప్రజలు. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఆధార్ కార్డ్తో పాన్/ఈపీఎఫ్ఓను లింక్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు.
ఇలా ఆధార్ కార్డ్తో ఈ రెండింటినీ లింక్ చేసుకోవడానికి పోస్టాఫీస్ లేదా యునిక్ ఐడీ అప్గ్రేడ్ సెంటర్లకు వెళ్లిన వారికి చుక్కెదురవుతోంది. ఈ సిస్టమ్ పని చేయట్లేదని, స్తంభించిపోయందనే సమాచారం అందుతోంది. ఫలితంగా- కార్డుదారుల్లో కొంత ఆందోళన, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు ముగుస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యవస్థ స్తంభించిపోయిందటూ వస్తోన్న వార్తలు మరింత కలవరపాటుకు గురి చేస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటన కాస్తా ఆధార్ కార్డుదారులకు ఊరట కలిగించేదే. ఆధార్ కార్డుతో పాన్/ఈపీఎఫ్ఓ లింకేజీ వ్యవస్థ స్తంభించిపోలేదని తేల్చి చెప్పాయి. ఇది సజావుగా కొనసాగుతోందని స్పష్టం చేశాయి. సాంకేతిక కారణాల వల్ల కొన్ని లోపాలు తలెత్తిన మాట వాస్తవమేనని అంగీకరించాయి. దాన్ని వెంటనే సరి చేసినట్లు తెలిపాయి.
ఆధార్ కార్డు ద్వారా ప్రజల వ్యక్తిగత వివరాలు, చిరునామా, ఫోన్ నంబర్, వారికి ఉన్న ఆస్తిపాస్తులు, వాహనాలు.. ఇలాంటివన్నీ తెలుసుకునే అవకాశం ఉన్నందున.. దాని సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోన్నామని యూఐడీఏఐ, ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి. ఆధార్ కార్డు వివరాలు బయటికి పొక్కకుండా ఉండేలా మరింత రక్షణ వలయాన్ని సమకూరుస్తున్నామని పేర్కొన్నాయి. సెక్యూరిటీ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తోన్నట్లు తెలిపాయి.
కొంతకాలంగా సెక్యూరిటీ అప్గ్రేడ్ పనులు కొనసాగుతోన్నాయని, ఫలితంగా కొంత సాంకేతిక లోపాలు తలెత్తి ఉండొచ్చని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్ కార్డుతో పాన్/ఈపీఎఫ్ఒఓ లింకేజీ చేయడం స్తంభించిపోయినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది సజావుగా సాగుతోందని వివరణ ఇచ్చింది. ఎన్రోల్మెంట్, మొబైల్ నంబర్ అప్డేట్ సర్వీసులు మాత్రం కొంత స్తంభించాయని, అవి కూడా కొన్ని అప్డేట్ సెంటర్లకు మాత్రమే పరిమితమైందని యూఐడీఏఐ పేర్కొంది.