కరోనా ఎఫెక్ట్.. ఈ ఏడాది కొత్త పథకాల్లేవ్, ఆ స్కీంలు కూడా ఆపేశాం: నిర్మలా సీతారామన్ ప్రకటన
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలు మినహాయించి ఎలాంటి కొత్త ప్రభుత్వ పథకాలు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూతన పథకాలు ఏవీ ప్రవేశపెట్టబోవడం లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Moratorium: ఈఎంఐ వడ్డీ మాఫీకి ఆర్బీఐ నో, నిలదీసిన సుప్రీం కోర్టు
ఇతర పథకాలు మార్చి 31 వరకు నిలుపుదల
దేశంలో కరోనా విజృంభిస్తోందని నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. ఆత్మనిర్భర్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అభియాన్ తదితర ప్రత్యేక పథకాలకు మాత్రమే నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ పథకాల పరిధిలోకి రాని ఏ ఖర్చులు ఇయినా ఆదాయ, వ్యయ విభాగం అనుమతి పొందాలని సూచించారు. ఇప్పటికే బడ్జెట్ ఆమోదం పొందిన ఇతర పథకాలను తదుపరి ఉత్తర్వుల దాకా మార్చి 31, 2021 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కొత్త పథకాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు కూడా పంపవద్దని ఇతర మంత్రిత్వ శాఖలకు ఆర్థిక శాఖ సూచించింది.
పరిమిత నిధులు.. విచక్షణతో ఉపయోగించాలి
ప్రస్తుతం దేశంలో 2,27,273 కేసులు ఉన్నాయి. 6,367 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ కరోనా కేసుల జాబితాలో ఏడో స్థానానికి చేరుకుంది. మరో ఏడువేలు దాటితే ఇటలీని దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న లాక్ డౌన్ వంటి కఠిన చర్యల కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉంది. కానీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి కోసం దీర్ఘకాలం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖర్చులపై కోతలు విధిస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమితంగా ఉన్న వనరులను మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ తెలిపింది. ఇందులో భాగంగా కొత్త పథకాలు ఏవీ ప్రకటించడం లేదని పేర్కొన్నారు.
కేంద్రం ప్యాకేజీ
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఖర్చులు పెరగడం, మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడం కారణంగా రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ మినహా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇతర పథకాలు అమల్లోకి రావు. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీలో మే 17వ తేదీన ఆర్బీఐ రూ.8.01 లక్షల కోట్ల లిక్విడిటీ చర్యలు కూడా ఉన్నాయి.