టాటాల చేతికి ఎయిరిండియా: ఏ నిర్ణయం తీసుకోకముందే..పుకార్లా: కేంద్రమంత్రి క్లారిటీ
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వార్తల్లో ఉంటూ వస్తోన్న అంశం.. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ. సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతూ వస్తోన్న ఎయిరిండియాలో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ తుదిదశకు వచ్చిందని, ఫైనాన్షియల్ బిడ్డింగ్స్లో నిలిచిన ప్రైవేటు కంపెనీకి దీన్ని అప్పగించడం ఒక్కటే మిగిలిపోయిందంటూ వార్తలు వెలువడ్డాయి. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన టాటాల చేతికే మళ్లీ ఎయిరిండియా వెళ్లబోతోందంటూ కథనాలు ప్రసారం అయ్యాయి.
ఆ కథనాలపై..
ఎయిరిండియాను టాటాల చేతికి అప్పగించడం ఖాయమైందంటూ అన్ని మీడియా సంస్థలూ ప్రత్యేక కథనాలను పబ్లిష్ చేశాయి. వాటిని ప్రసారం చేశాయి. ఈ వార్తలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఎయిరిండియాను అమ్మకానికి పెట్టిన విషయం వాస్తవమే అయినప్పటికీ.. దాన్ని టాటాల చేతికి అప్పగించబోతున్నామంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు.
ఇంకా ప్రాసెస్లోనే
ఎయిరిండియా బిడ్డింగ్స్ రేసులో టాటా గ్రూప్ కంపెనీలతో పాటు మరి కొన్ని ప్రైవేటు విమానయాన సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిల్లో ఏ సంస్థ కూడా ఇంకా ఫైనల్ విన్నర్గా నిలవలేదని చెప్పారు. ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం తాను దుబాయ్లో ఉన్నానని, ఎయిరిండియాను టాటాల చేతికి అప్పగించినట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి తనకు అందిన సమాచారం మేరకు.. బిడ్డర్స్ ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని అన్నారు.
దీపం కార్యదర్శి సైతం..
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ (దీపం) ఆధ్వర్యంలో ఎయిరిండియా ఫైనల్ బిడ్డర్స్ ఎంపిక కొనసాగుతోందని, ఇప్పటిదాకా దాఖలైన బిడ్డింగ్స్ అన్నింటినీ ఇంకా అసెస్మెంట్ చేస్తున్నామని దీపం విభాగం కార్యదర్శి నుంచి సైతం తనకు సమాచారం అందిందని పీయూష్ గోయెల్ తెలిపారు. ఎయిరిండియాను టాటాల చేతికి అప్పగించబోతోన్నామంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
అన్ని వివరాలూ ఇస్తాం..
దీపం కార్యదర్శి తుహిన్ కాంత పాండే సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎయిరిండియా ఫైనల్ బిడ్డర్ ఎవరో ఇంకా తేలాల్సి ఉందని స్పష్టం చేశారు. బిడ్డర్ ఎంపిక ఇంకా ప్రారంభ దశలో ఉందని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో మీడియాలో వచ్చిన వార్తలు ఏవీ కూడా వాస్తవం కాదని అన్నారు. నిరాధారమైన వార్తలని తుహిన్ కాంత పాండే తేల్చి చెప్పారు. ఫైనల్ బిడ్డింగ్ రేసులో టాటాలతో పాటు మరి కొన్ని ప్రైవేటు పౌర విమానయాన సంస్థలు ఉన్నాయని, మీడియాలో వచ్చిన కథనాల ప్రభావం- ఈ ప్రక్రియపై పడుతుందనే కారణంతోనే వివరణ ఇస్తున్నామని పేర్కొన్నారు.
స్పైస్ జెట్కు
ఎయిరిండియా నుండి కూడా ప్రకటన రావాల్సి ఉంది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో ఎయిరిండియా బిడ్ ఆకర్షణీయంగా ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. విజయవంతమైన బిడ్డర్ పేరును దసరా నాటికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ, స్పష్టత రావాల్సి ఉంది. ఎయిరిండియా 2007లో ఇండియన్ ఎయిర్ లైన్స్లో విలీనమైనప్పటి నుంచీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఎయిరిండియా కోసం పలు సంస్థలు ఆర్థిక బిడ్స్ దాఖలు చేశాయి. స్పైస్ జెట్ అధినేత అజయ్ సింగ్ కూడా ఆర్థిక బిడ్ సమర్పించారు. ఎయిరిండియా నుండి ప్రభుత్వం వంద శాతం వాటాను ఉపసంహరించుకుంటోంది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్లోను వంద శాతం మొత్తాన్ని వదులుకుంటుంది.