శాలరీ స్ట్రక్చర్లో ఎలాంటి మార్పులేదు, కంపెనీలకు భారీ ఊరట
కేంద్రం కొత్తగా తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ అమలు వాయిదా పడింది. కొన్ని రాష్ట్రాలు లేబర్ కోడ్స్కు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయలేదు. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి శాలరీ స్ట్రక్చర్లో మార్పులు జరగాలి. కానీ ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవు. ఉద్యోగుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించిన స్మృతులను కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది.
ఏప్రిల్ 1 నుండి నాలుగు కోడ్స్ను అమలు చేయాలని కార్మిక శాఖ నిర్ణయించింది. రాజ్యాంగం ప్రకారం కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. దీంతో అటు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా నిబంధనలను నోటిఫై చేయాలి. కొన్ని రాష్ట్రాలు డ్రాఫ్ట్ నిబంధనలు రూపొందించినప్పటికీ, ఇంకొన్ని రాష్ట్రాలు ఇంకా ఖరారుచేయలేదు. దీంతో లేబర్ కోడ్ అమలును వాయిదా వేశారు.
Alert: ఈరోజు నుండి ఇవి చెల్లవు.. మార్పులు ఇవే! ఐటీ రిటర్న్స్ షాక్, వీటిపై ఊరట
కొత్త శాలరీ విధానం తర్వాత మార్పులు
కొత్త వేజ్ కోడ్ వల్ల శాలరీ విధానంలో మార్పులు ఉంటాయి. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్ను తక్కువగా చూపి అలవెన్సును రూపంలో ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం అలవెన్సుల వాటా 50 శాతం మించకూడదు. అంటే బేసిక్ లెక్క పెరుగుతుంది. ఈ క్రమంలో బేసిక్, డీఏ ఆధారంగా లెక్కించే పీఎఫ్ వాటా కూడా పెరుగుతుంది. కొత్త లేబర్ కోడ్స్ ఎప్పుడు అమల్లోకి వస్తే ఆ మేరకు టేక్ హోమ్ శాలరీ, పీఎఫ్ మొత్తంలో మార్పులు ఉంటాయి. ఇప్పుడు లేబర్ కోడ్స్ అమలు వాయిదా పడిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు పాత విధానంలోనే శాలరీని అందుకోవాల్సి ఉంటుంది.
కంపెనీలకు ఊరట
కొత్త వేతన చట్టం వల్ల ఉద్యోగుల యాజమాన్యాలపై భారం పడుతుందనే వాదనలు ఉన్నాయి. ఈ అంశాన్ని పరిశ్రమ బాడీ కేంద్రమంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ సందర్భంగా గతంలో ప్రస్తావించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం కొత్త శాలరీ విధానం మార్పు వాయిదా పడటం కంపెనీలకు భారీ ఊరటగా చెప్పవచ్చు. అలాగే, ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ పైన రీ-వర్క్ కోసం మరింత సమయం వచ్చినట్లవుతుంది.
జమ్ము కాశ్మీర్ మాత్రమే..
కేవలం జమ్ము కాశ్మీర్ మాత్రమే కొత్త శాలరీ నిర్మాణాన్ని నోటిఫై చేసింది. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు రెండు కోడ్స్ను, కర్నాటక ఒక కోడ్పై నిలిపివేశాయి. ఈ కోడ్ ఎప్పుడు అమలులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.