Nitin Gadkari: కనుమరుగు కానున్న పెట్రోల్.. రూ.80 ఖర్చుతో 400 కిలోమీటర్ల ప్రయాణం
Hydrogen Fuel: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ దేశ వీధుల్లో త్వరలోనే హైడ్రోజన్ బస్సులు తిరుగుతాయని అన్నారు. దేశంలోని విమానాలకు ఇంధనంగా హైడ్రోజన్ను ఉపయోగించనున్నట్లు రైజింగ్ ఇండియా సమ్మిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ఎక్కువగా ఇంధన దిగుమతులపై ఆధారపడుతోంది. అయితే ఈ పరిస్థితులను పూర్తిగా మార్చేందుకు మోదీ సర్కార్ పరయత్నిస్తోంది.
ఇంధన ఎగుమతిదారుగా భారతదేశాన్ని మార్చాలని కోరుకుంటున్నట్లు దిగుమతిదారుగా కాదని నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత భవిష్యత్తు రవాణా వ్యవస్థల్లో హైడ్రోజన్ వినియోగాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విమానాలకు సైతం త్వరలో హైడ్రోజన్ని ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలతో పాటు అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టం సృష్టిపై భారీగా పెట్టుబడులు పెట్టాయి.
ఎలక్ట్రోలైజర్ల తయారీలో భారత్ మొదటి స్థానంలో ఉందని బీజేపీ నేతలు చెప్పారు. కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే పరిమితం కాకుండా యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నా గడ్కరీ వెల్లడించారు. తమ ప్రయత్నాలు ఎంత బలంగా ఉన్నాయో తెలిపేందుకు రవాణాశాఖ మంత్రి గడ్కరీ హైడ్రోజన్తో నడిచే కారులో సమ్మిట్ వేదిక వద్దకు చేరుకున్నారు.
దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు వర్థాలు, వ్యర్థ జలాలను ఉపయోగించాలని చూస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కరెంటు లేకుండా బయో వేస్ట్తో గ్రీన్ హైడ్రోజన్ను తయారు చేసే మార్గాన్ని కనుగొందని ఆయన వెల్లడించారు. దీనిని ఇంధనంగా వినియోగించటం ద్వారా కేవలం రూ.80 ఖర్చుతో వాహనాన్ని 400 కిలోమీటర్లకు పైగా నడపవచ్చని పేర్కొన్నారు.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచటంతో పాటు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ కార్లు, స్కూటర్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కిలోమీటరుకు.. డీజిల్ బస్సుకు రూ.115, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుకు రూ.39, ఏసీ ఎలక్ట్రిక్ బస్సుకు రూ.41 ఖర్చవుతోందని ఆయన వెల్లడించారు.