ఇండియన్ ఓవర్సీస్, సెంట్రల్ బ్యాంకు: ప్రయివేటీకరణకు ఈ రెండు బ్యాంకులు
సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును ప్రయవేటీకరించాలని నీతి అయోగ్ సిఫార్సు చేసింది. రెండు బ్యాంకుల ప్రయివేటీకరణకు గత కొంతకాలంగా కసరత్తు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా నీతి అయోగ్ పైరెండు బ్యాంకుల ప్రయివేటీకరణకు సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు కూడా ఉండొచ్చునని తెలుస్తోంది. ప్రయివేటీకరణ అంటే ఈ బ్యాంకుల్లో ప్రభుత్వం తన వాటాను విక్రయిస్తుంది. 2021-22లో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటీకరించనున్నట్లు గత బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
నీతి అయోగ్ సిఫార్సు
విలీనం చేయాల్సిన లేదా ప్రయివేటీకరించాల్సిన లేదా ఇతర PSUలకు అనుబంధ సంస్థలుగా మార్చాలిన ప్రభుత్వరంగ సంస్థల పేర్లను నీతి ఆయోగ్ సిఫార్సు చేయాలి. ఇందులో భాగంగా ప్రయివేటీకరణ నిమిత్తం పై రెండు బ్యాంకుల పేర్లను నీతి ఆయోగ్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్), ఆర్థిక సేవల విభాగం పరిశీలించి, చట్టపరంగా అవసరమైన మార్పులు చేస్తాయి. ప్రయివేటీకరణ ప్రక్రియ కాలపరిమితి కూడా ఈ మార్పులపై ఆధారపడి ఉంటుంది.
బ్యాంకింగ్ రంగం ఇబ్బందులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 బ్యాంకులను ప్రయివేటీకరించాలనే ప్రభుత్వ ప్రణాళిక కార్యరూపం దాల్చడం ఆలస్యం కావొచ్చని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారతీయ బ్యాంకింగ్ రంగం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, అందుకే ఆలస్యం కావొచ్చునని తెలిపింది.
రూ.44,000 కోట్ల వ్యాల్యూ
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు వ్యాల్యూను రూ.44,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ర.31,641 కోట్ల వరకు ఉండవచ్చు. బ్యాంకులు, ఎల్ఐసీ ప్రయివేటీకరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.