India on sale: ఢిల్లీ రైల్వే స్టేషన్ను అమ్మేశారు.. రాహుల్ గాంధీకి నిర్మలమ్మ కౌంటర్
ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ ప్రయివేటుకు అప్పగించడం ద్వారా నాలుగు సంవత్సరాల్లో రూ.6 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇరవై రకాల మౌలిక ఆస్తులను మానిటైజేషన్ చేయనున్నారు. అయితే ఈ ఆస్తుల పైన ప్రయివేటుకు ఎలాంటి హక్కు ఉండదు. యజమాని కేంద్ర ప్రభుత్వమే. కేవలం కొన్నాళ్లపాటు ఆస్తుల నిర్వహణను మాత్రమే ప్రయివేటుకు అప్పగిస్తారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత్ను అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. అసలు మోనెటైజేషన్ అంటే రాహుల్ గాంధీకి తెలుసా?, దేశంలోని వనరులను అమ్మేసి ముడుపులు తీసుకున్నది ఎవరు అని నిర్మలమ్మ దుయ్యబట్టారు.
గత డెబ్బై సంవత్సరాల్లో దేశంలో ఏమీ జరగలేదంటూ మరోవైపు, ఈ కాలంలో సృష్టించిన ఆస్తులను బీజేపీ ప్రభుత్వం అమ్మివేస్తోందని, రాహుల్ గాంధీ మంగళవారం కేంద్రం ప్రకటించిన జాతీయ మోనెటైజేషన్ పైప్లైన్ను ఉద్దేశించి విమర్శించారు. కీలక రంగాల్లో గుత్తాధిపత్యం, ఉద్యోగాలను నాశనం చేయడమే లక్ష్యంగా మోడీ సర్కార్ ప్రయివేటీకరణ ప్రణాళిక ఉందన్నారు. గత ప్రభుత్వాలు సృష్టించిన సంపదను విక్రయించే ప్రక్రియలో ప్రభుత్వం ఉందన్నారు. దీనిపై నిర్మలమ్మ స్పందించారు.
అసలు రాహుల్ గాంధీకి మోనెటైజేషన్ అంటే తెలుస్తోందా? అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశంలోని వనరులను అన్నింటిని అమ్మివేసి ముడుపులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోనెటైజేషన్ చేసిందని, ఆ విషయాన్ని రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. 2008లో ముంబై-పుణే ఎక్స్ప్రెస్ వేను మోనెటైజేషన్ చేయడం ద్వారా యూపీఏ ప్రభుత్వం రూ.8000 కోట్లను సమీకరించిందని, అలాగే, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను లీజుకు ఇచ్చే ప్రతిపాదనను కూడా తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. గతంలో కామన్వెల్త్ గేమ్స్ సమయంలో ఏం జరిగిందని గుర్తు చేశారు.
అసలు ప్రాపర్టీ మోనెటైజేషన్ ప్లాన్లో ఆస్తుల విక్రయం లేదని, కేవలం కొంతకాలం ప్రయివేటు తీసుకుంటుందని, ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తుందని గుర్తు చేశారు. మోనెటైజైషన్ ప్రక్రియ ద్వారా వాటిని మరింత ఎక్కువగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.