భారత్కు నీరవ్ మోడీ అప్పగింత మరింత ఆలస్యం
పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు వేలకోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. నీరవ్ను భారత్కు అప్పగించేందుకు సమ్మతిస్తూ గత నెల బ్రిటన్ హోమ్మంత్రి ప్రీతిపటేల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేయడానికి అనుమతించాలని నీరవ్ మోడీ ఇటీవల అప్పీల్ చేసుకున్నాడు.
నీరవ్ మోడీ అప్పీల్ను హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించి, హోమ్మంత్రి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయడానికి తగిన కారణాలు ఆ అప్పీల్లో ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించాల్సి ఉంది. దానిపై నీరవ్ మోడీకి అనుకూలంగా హైకోర్టు జడ్జి నిర్ణయం తీసుకుంటే అప్పుడు తమ అప్పీల్పై విచారణ చేయాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరవచ్చు.
అయితే ఈ న్యాయ ప్రక్రియ ముగియడానికి కాలపరిమితి ఏమీలేదు. ఇది కొద్ది నెలలపాటు కొనసాగవచ్చు. కాబట్టి నీరవ్ మోడీని భారత్కు రప్పించే అంశం మరింత ఆలస్యం కానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ బ్రిటన్లో తలదాచుకుంటున్నాడు.