దేవుడ్నే అడగండి, ఇన్ఫోసిస్పై మా లెక్క మేం తేలుస్తాం: నీలేకనికి సెబి చైర్మన్
ముంబై: టాప్ మేనేజ్మెంట్ అనైతిక విధానాలకు పాల్పడుతోందని గుర్తు తెలియని ఉద్యోగులు చేసిన ఆరోపణలపై ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని ఇటీవల స్పందిస్తూ... స్వయంగా దేవుడే దిగి వచ్చినా తాము తప్పుడు లెక్కలు రాయబోమని వ్యాఖ్యానించారు. కంపెనీ ప్రక్రియ అంత బలంగా ఉంటుందని చెప్పారు. విజిల్ బ్లోయర్స్ చేసిన ఆరోపణలు అవమానకరమైనవన్నారు. అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, దీనిపై తమ అభిప్రాయాలను రుద్దే ప్రసక్తి మాత్రం లేదన్నారు. అయితే నందన్ నీలేకని వ్యాఖ్యలపై సెబి చైర్మన్ స్పందించారు. ఇన్ఫోసిస్ విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదులపై దర్యాఫ్తు జరుగుతోందని సెబి చైర్మన్ అజయ్ త్యాగీ అన్నారు.
దేవుడే వచ్చి చెప్పినా ఇన్ఫోసిస్ లెక్క అంతే: నందన్ నీలేకని
నందన్ నీలేకని వ్యాఖ్యలపై స్పందించమని కోరగా... దేవుడిని అడగండి లేదా ఆయననే అడగాలని త్యాగీ అన్నారు. ఇన్వెస్టర్లు సొంతగానే ఓ నిర్ణయానికి రావాలని, మేం ఏం చేయాల్సి ఉంటుందో ఆ పని చేస్తున్నామన్నారు. ఏమి తేలుతుందో ఆ విషయం మీకు తెలుస్తుందని చెప్పారు.
అమెరికాలో కూడా ఇన్ఫోసిస్ నమోదయిందని, అక్కడి నియంత్రణ సంస్థతోను సమాచారం పంచుకుంటున్నారా అడగగా.. అది రెండు నియంత్రణ సంస్థల విషయమని, గోప్యత పాటించాల్సి ఉంటుందన్నారు. ఇన్ఫోసిస్ లెక్కలు సరైనవా కావా అనే విషయంలో మా విచారణ కొనసాగుతుందని, నందన్ నీలేకని అలా అంటే మాత్రం ఆయనను అడగండి లేదా దేవుడిని అడగండన్నారు.