Twitterకు రివర్స్ షాక్: శాశ్వత నిషేధం: దేశాధ్యక్షుడి పోస్టులను తొలగించిన ఫలితం
అబుజా: టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా దుమారం చెలరేగుతోన్నట్టే కనిపిస్తోంది. ఆ సంస్థ యాజమాన్యం చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియ.. అనేక దేశాలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. ఆ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్.. క్రమంగా తన పట్టును కోల్పోతోందనడానికి అద్దం పడుతున్నాయా వ్యవహారాలు. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న వ్యక్తిగత ఖాతాకు చెందిన బ్లూ టిక్ను తొలగించడంపై భారత్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పలువురు బారతీయ జనతా పార్టీ నాయకులు ట్విట్టర్పై విమర్శలు చేస్తోన్నారు.
Twitter: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి బిగ్ షాక్: వ్యక్తిగత అకౌంట్ నుంచి..!
ఈ పరిస్థితిని భారత్ ఒక్కటే కాదు.. నైజీరియా కూడా ఎదుర్కొంటోంది. ట్విట్టర్ చర్యను నిరసిస్తూ ఆ దేశం ఏకంగా.. దాన్ని శాశ్వతంగా నిషేధించింది. ట్విట్టర్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ పోస్టులను డిలేట్ చేయడాన్ని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి వ్యక్తిగత అకౌంట్ బ్లూ టిక్ను తొలగించినట్టే ట్విట్టర్ యాజమాన్యం.. నైజీరియా అధ్యక్షుడు చేసిన కొన్ని పోస్టులను డిలేట్ చేసింది.
ఈ చర్య పట్ల అక్కడి ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ట్విట్టర్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేస్తోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నైజీరియా సమాచార శాఖ మంత్రి అల్ హజీ లయ్ మహ్మద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ట్విట్టర్ డిలేట్ చేసిన ఆ పోస్ట్.. దేనికి సంబంధించిందనే విషయాన్ని వివరించలేదు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ట్విట్టర్ సేవలు తమ దేశంలో అందుబాటులో ఉండబోవని స్పష్టం చేశారు. తమ దేశ కార్పొరేట్ చట్టాల ప్రకారం.. ట్విట్టర్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
PRESS RELEASE
— Fed Min of Info & Cu (@FMICNigeria) June 4, 2021
FG Suspends @Twitter Operations in Nigeria pic.twitter.com/7z5BQ0Mi3U
అలాగే- ఓటీటీ, సోషల్ మీడియా లైసెన్సింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉంటుందని, దీనిపై ఓ సమగ్ర నివేదికను అందజేయాలంటూ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కమిషన్ను ఆదేశించారు. ఇకపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తమ దేశంలో కార్యకలాపాలను కొనసాగించాలంటే.. తాము రూపొందించబోయే మార్గదర్శకాలు, విధి విధానాలకు లోబడి ఉండేలా మార్పులను చేయబోతోన్నట్లు తెలిపారు. ముహమ్మదు బుహారి ట్వీట్లను తొలగించడంపై ట్విట్టర్ యాజమాన్యం స్పందించింది. లోపం ఎక్కడ చోటు చేసుకుందనేది ఆరా తీస్తున్నామని తెలిపింది.