సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం, నిఫ్టీ 14,400 దిగువకు
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం నుండి సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఉదయం 48,956.65 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 48,956.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,102.23 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 1,381.22 (2.79%) పాయింట్లు క్షీణించి 48,208.23 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 408.95 (2.76%) పాయింట్లు నష్టపోయి 14,429.70 వద్ద ట్రేడ్ అయింది.
ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి సూచి, మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సోమవారం వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. మరోవైపు కరోనా కేసులు భారీగా పెరగటం, వివిధ నగరాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేయడంతో వ్యాపారాలపై మళ్లీ ప్రభావం చూపిస్తుందనే భయాలు మార్కెట్లను వెంటాడాయి. అలాగే, ఈ రోజు టీసీఎస్ త్రైమాసిక ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. నిఫ్టీ50 సూచీలోని దాదాపు 40కి పైగా షేర్లు నష్టపోయాయి.