2015లోని అంచనా కంటే చాలా ఎక్కువ, 6 నెలలు జాగ్రత్త..: బిల్గేట్స్ హెచ్చరిక
రాబోయే ఐదారు నెలలు కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో అమెరికా సహా వివిధ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరగడంతో పాటు, మరణాలు కూడా ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన సూచనలు గమనార్హం. 'వచ్చే నాలుగు నెలల నుండి ఆరు నెలల వరకు కరోనా ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. IHME (ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాక్యులేషన్) అంచనాల మేరకు 200,000 అదనపు మరణాలు నమోదు కావొచ్చు.' అని బిల్ గేట్స్ అన్నారు.
జాగ్రత్తగా ఉండాలి
కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వాల సూచనలు పాటించాలని బిల్ గేట్స్ అన్నారు. మాస్కులు ధరించడం, అందరిలోను కలవకపోవడం వంటి నిబంధనలు పాటిస్తే మరణాలను ఎక్కువ శాతం నివారించవచ్చునని బిల్ గేట్స్ అన్నారు. కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 2,90,000 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అనారోగ్య సమస్యలు సృష్ఠిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించడం తప్పనిసరి అన్నారు. లేదంటే వైరస్ మరింత విజృంభించవచ్చని, దీంతో మరణాల సంఖ్య సైతం పెరిగే అవకాశముందన్నారు.
2015లోనే అంచనా
తమ ఫౌండేషన్ కరోనా వ్యాక్సీన్ పరిశోధనల కోసం భారీగా నిధులు సమకూరుస్తోందని బిల్ గేట్స్ తెలిపారు. వైరస్ల కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకోవచ్చునని తాను 2015లోనే అంచనా వేశానని, అయితో ఇప్పుడు కరోనావల్ల తన అంచనాలకు మించి మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ముందు ముందు మరిన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ కారణంగా అమెరికాతో పాటు ప్రపంచంపై పడిన ఆర్థిక ప్రభావం ఆందోళనలు కలిగిస్తోందన్నారు.
బాధాకరమైన అంశం..
కరోనా వల్ల మరింత మంది మృతి చెందవచ్చునని IHME అంచనా వేసిందని, ఇదెంతో బాధాకరమైన విషయమన్నారు. మాస్కులు, సామాజిక దూరం వంటి జాగ్రత్తలతో ఈ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని భావిస్తున్నట్లు తెలిపారు. పేద దేశాలకు అమెరికా సహకారం ఉండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగాలని, మరణాలు తగ్గించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వ్యాక్సీన్ల సామర్థ్యాన్ని అమెరికా పెంచుకోవాలన్నారు.