దెబ్బ మీద దెబ్బ, ఆర్థిక సవాళ్ళు: ఒక డాలర్కే అతిపెద్ద మీడియా హౌస్ అమ్మకం
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. దీంతో ఎన్నో సంస్థలు వేతనాలు ఇవ్వలేకపోతున్నాయి. వ్యాపారులకు బిజినెస్ లేదు. దీంతో ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమవుతోంది. ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ నుండి ఆతిథ్య రంగం, ఆటో రంగం, విమానయాన రంగం వరకు భారీ ప్రభావం పడింది. దీంతో కొనేవాళ్లు లేక ధరలు తగ్గుతున్న రంగాలు ఎన్నో ఉన్నాయి. అయితే అంతకుముందే ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన చిన్న కంపెనీల నుండి పెద్ద కంపెనీల వరకు కరోనా వల్ల మరిన్ని కష్టాలు పడుతున్నాయి. అంతకుముందు ప్రకటనలు లేక చితికిపోయి, ఆ తర్వాత కరోనా వల్ల న్యూజిలాండ్లో అయితే ఓ మీడియా సంస్థను ఎవరూ ఊహించని అతి తక్కువ ధరకు అమ్మేశారు.
హెచ్చరిక: ప్రజల చేతుల్లో డబ్బులేవి, తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి భారత్
సీఈవోకు 1 డాలర్కే 'స్టఫ్' విక్రయం
కరోనా దెబ్బతో మీడియాకు రెవెన్యూ పడిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు కుదేలవుతున్నాయి. దీనికి నిదర్శనమే న్యూజిలాండ్లోని అతిపెద్ద, ప్రముఖ మీడియా సంస్థ స్టఫ్. ఈ పత్రిక ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూనే, క్రమంగా స్టఫ్ పేరుతో ప్రజాదరణ చూరగొన్న వెబ్ సైట్ను కూడా నిర్వహిస్తోంది. ఈ సంస్థను కేవలం ఒక డాలర్కు కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్కు విక్రయిస్తున్నట్లు మాతృసంస్థ నైన్ ఎంటర్టైన్మెంట్ తెలిపింది.
ముందే ఆదాయం లేదు.. ఆ తర్వాత కరోనా దెబ్బ
స్టఫ్ మీడియా హౌస్లో 900 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 400 మంది జర్నలిస్టులు. ఈ స్టఫ్ ఓనర్ ఆస్ట్రేలియాకు చెందిన నైన్ ఎంటర్టైన్మెంట్. అయితే కరోనాకు ముందే స్టఫ్ ప్రకటనలు లేక విలవిల్లాడుతోంది. అప్పటి నుండే ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రకటనల ఆదాయాలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఇప్పుడు కరోనా రూపంలో మరింత దెబ్బతీసింది.
స్థానిక యాజమాన్యం..
ఈ డీల్ ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్కు తెలిపింది స్టఫ్ యాజమాన్యం. ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది. స్థానిక యాజమాన్యాన్ని కలిగి ఉండటం స్టఫ్కు ముఖ్యమని తాము విశ్వసిస్తున్నామని పేర్కొంది. సంస్థలో సిబ్బందికి ప్రత్యక్ష వాటా ఇవ్వడం ద్వారా యాజమాన్యాన్ని మార్చడమే తమ ప్రణాళిక అని చెబుతున్నారు. స్థానికులే యజమానులుగా ఉండటం ద్వారా తమ ఉద్యోగులకు, కస్టమర్లకు, కివీస్ ప్రజలకు ప్రయోజనం అని తెలిపింది. అయితే స్టఫ్ను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థి మీడియా సంస్థ ఎన్జెడ్ఎంఈ ప్రయత్నాలు చేసింది. దీనిని అడ్డుకున్నట్లయింది.