ట్విట్టర్పై భారతీయ ముద్ర: ప్రక్షాళన మొదలు పెట్టిన పరాగ్: ఇద్దరు సీనియర్లు గుడ్బై
వాషింగ్టన్: టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ ప్రక్షాళన మొదలైంది. ఈ ప్లాట్ఫామ్ కొత్త ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను స్వీకరించిన భారతీయుడు పరాగ్ అగ్రవాల్.. ట్విట్టర్ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. తొలిదశలో ఈ రీస్ట్రక్చరింగ్ అనేది అత్యున్నత స్థాయిలో చోటు చేసుకుంటోంది. దీని తరువాత దశలవారీగా దీన్ని కొనసాగనుంది. ట్విట్టర్లో వివిధ హోదాలు, స్థాయిల్లో చోటు చేసుకున్న లోపాలను సవరించడంలో భాగంగా ఈ ప్రక్షాళన పనులను పరాగ్ అగ్రవాల్ చేపట్టారు. దీనిపై ది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
పునర్నిర్మాణంలో భాగంగా ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్పై వేటు పడింది. ఇంటర్నల్ ఇమెయిల్, ట్విట్టర్ చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్ డాంట్లే డేవిస్.. తన పదవికి రాజీనామా చేశారు. 2019లో ఆయన ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అధినేత మైఖెల్ మొంటానో సైతం తప్పుకొన్నారు. 2011లో ఆయన ఇంజినీర్గా ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. పరాగ్ అగ్రవాల్కు సమకాలీకుడు. వారిద్దరూ ట్విట్టర్కు గుడ్బై చెప్పినట్టు ది వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.
డాంట్లే డేవిస్, మైఖెల్ మొంటానో.. ఈ నెల చివరి వరకూ కొనసాగుతారు. ట్విట్టర్ మాజీ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ కేవాన్ బేక్పౌర్ను కన్స్యూమర్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్గా నియమించారు. నిక్ కాల్డ్వెల్ను కోర్ టెక్ జనరల్ మేనేజర్గా బదిలీ చేశారు. స్ట్రాటజీ, ఆపరేషన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ లిండ్సేకు ప్రమోషన్ కల్పించారు పరాగ్ అగ్రవాల్. ఆమెను పూర్తిస్థాయి ఉపాధ్యక్షురాలిగా అపాయింట్ చేశారు. నేరుగా ఆమె పరాగ్ అగ్రవాల్కు రిపోర్ట్ చేస్తారు.
ఆపరేషనల్ ఎక్సలెన్సీపై పరాగ్ అగ్రవాల్ ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని ఈ కథనం స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది ట్విట్టర్. నకిలీ వార్తలు, వీడియోలు వైరల్గా మారడాన్ని అడ్డుకోలేకపోతోందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ విషయంలో ట్విట్టర్ భారత విభాగం హెడ్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయుడైన పరాగ్ అగ్రవాల్.. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ చీఫ్గా అపాయింట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.