బ్యాంకు కస్టమర్లకు అలర్ట్, ఆ రోజున NEFT సేవలు 14 గంటలు బంద్
ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, పీఎన్పీ సహా వివిధ బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్. ఈ నెల 23వ తేదీన 14 గంటల పాటు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు. ఈ మేరకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నేడు చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపే NEFT(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సుఫర్) సేవల్లో అంతరాయం ఏర్పడటం గమనార్హం. వచ్చే ఆదివారం(మే 23) ఈ సేవలు పనిచేయవని ఆర్బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది.
సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపరచడం కోసం మే 22వ తేదీన వ్యాపార వేళలు ముగిసిన అనంతరం ఈ సాఫ్టువేర్లో సాంకేతిక అపడేషన్ చేపడుతున్నామని, అందువల్ల మే 23వ తేదీన 00.01 గంటల నుండి అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుండి - మధ్యాహ్నం రెండు గంటల వరకు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే ఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.
ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారం ఇస్తాయని ఆర్బీఐ తెలిపింది. ఏప్రిల్ 18వ తేదీన ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ ఆర్బీఐ ఇలాంటి టెక్నికల్ అప్గ్రేడేషన్ను చేపట్టింది. 2019 డిసెంబర్ నుండి నెప్ట్ సేవలు 24×7 అందుబాటులోకి వచ్చాయి.