ఏటేటా పెరుగుతోన్న వ్యాపారవేత్తల ఆత్మహత్యలు!
చిన్నదైనా, పెద్దదైనా.. పరిస్థితులు అనుకూలించనప్పుడు వ్యాపారాలలో నష్టాలు రావడం సహజం. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే వ్యాపార వేత్తలు గుండె నిబ్బరంతో వ్యవహరించాలి. రుణ దాతలు, బ్యాంకుల ఒత్తిడిని తట్టుకోగలగాలి. కానీ కార్పొరేట్ రంగంలో వాస్తవం మరోలా ఉంది.
చాలామంది వ్యాపారవేత్తలు తాము చేసే వ్యాపారాలలో ఒడిదొడుకులు, నష్టాలు భరించలేక పోతున్నారు. 'దివాలా' అనేది ఒక అవమానంగా భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక, కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడి అర్థంతరంగా జీవితం చాలిస్తున్నారు.
‘కేఫ్ కాఫీ డే' విషాదం గుర్తుందిగా...
‘కేఫ్ కాఫీ డే' వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య గుర్తుంది కదా. ఆయనకు ఇంకా ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి. ‘కేఫ్ కాఫీ డే'ను ఎన్నో దేశాలకు కూడా పరిచయం చేశారు. అలాంటి బిజినెస్ టైకూన్ సైతం అప్పుల బాధను తట్టుకోలేకపోయారు. రుణ దాతలు, ఐటీ అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక, ఇటు కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేక చివరికి వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు.
ఏటా పెరుగుతోన్న మరణాలు...
దేశంలో ఎంతోమంది వ్యాపార వేత్తలు తాము చేసే వ్యాపారాల్లో ఆటుపోట్లు చవిచూస్తున్నారు. చేస్తోన్న వ్యాపారాలు దివాలా తీయడంతో, కష్టించి పనిచేసినా, ఫలితం రాకపోతుండటంతో చాలా మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఏటా కార్పొరేట్ సూసైడ్స్ పెరిగి పోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం 2018లో 7,990 మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఈ సంఖ్య అంతకుముందు ఏడాదిలో చనిపోయిన 7,778 మందితో పోలిస్తే 2.7 శాతం పెరిగింది.
జీడీపీ ఎక్కువ.. మరణాలూ ఎక్కువే...
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆర్థికాభివృద్ధి(జీడీపీ) అధికంగా ఉన్న రాష్ట్రాల్లోనే వ్యాపార వేత్తల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వ్యాపారవేత్తల్లో కర్నాటక నుంచి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 1,113 మంది ప్రాణాలు తీసుకోగా.. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో 969 మంది వ్యాపారవేత్తలు, అలాగే తమిళనాడులో 931 మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కారణం.. ‘దివాలా'యే...
వ్యాపారవేత్తల ఆత్మహత్యలకు గల కారణాలను కూడా ఎన్సీఆర్బీ డేటా వెల్లడించింది. 2018 లో మొత్తం 4,970 మందికి పైగా వ్యాపారవేత్తలు వ్యాపారంలో దివాలా కారణంగా ప్రాణాలు తీసుకున్నారట. 2017లో ఈ సంఖ్య 5,151గా ఉంది. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. వ్యాపారాలు దివాలా తీయడంతో చనిపోయిన వారి సంఖ్య కాస్త తగ్గింది. అయితే వ్యాపారాలు దివాలా తీయడాన్ని చాలా మంది బయటికి చెప్పుకోలేక లోలోపల సతమతమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. వ్యాపారంలో నష్టం రావడం అనేది కుటుంబంలో పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చేదిగా పలువురు వ్యాపారవేత్తలు భావిస్తున్నారని, అందుకే అవమానం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ కలహాలు...
వ్యాపారవేత్తల ఆత్మహత్యలు తరచి చూస్తే.. ఇలాంటి కేసుల్లో రెండో అతిపెద్ద కారణంగా కుటుంబ కలహాలు నిలుస్తున్నాయి. 2017లో కుటుంబాల్లో గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారు 30.1 శాతం ఉంటే, ఈ సంఖ్య 2018 నాటికి 30.4 శాతానికి పెరిగింది. కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందుల వల్లే వస్తున్నాయట. ఇక ఆరోగ్యపరమైన సమస్యలతో 17.7 శాతం మంది, పెళ్లి సంబంధమైన కారణాలతో 6.2 శాతం మంది, డ్రగ్స్కు బానిసలై 5.3 శాతం మంది, లవ్ ఫెయిల్యూర్తో 4 శాతం మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ డేటా వెల్లడిస్తోంది.
రోజుకు కనీసం 13 మంది...
రోజుకు 13 మందికి పైగా వ్యక్తులు కేవలం వ్యాపారాలలో దివాలా కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. మహారాష్ట్రలో 1,541 సూసైడ్లు, కర్నాటకలో 1391 ఆత్మహత్యలు, బెంగళూరులో 142 కేసులు దివాలాకు సంబంధించినవే ఉన్నాయి. ముంబైలో 20 మంది వ్యాపారాలు దివాలా తీయడంతో చనిపోయారు. రోజంతా కష్టపడినా వ్యాపారంలో తగినంత ప్రతిఫలం రాకపోవడం వ్యాపారవేత్తలను బాగా కుంగదీస్తోందని, దీంతో పరిస్థితిని చక్కబెట్టలేని నిస్సహాయ స్థితిలో వారు ప్రాణం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వ్యాపారంలో ఒత్తిడిని ఇలా ఎదుర్కోవాలి...
బిజినెస్లో ఫెయిల్యూర్ అనేది కామన్. అదేం అవమానం కాదు. వ్యాపారం చేయి దాటిపోవడం, ఎంత ప్రయత్నించినా నిలబెట్టలేకపోవడం.. ఇలాంటివన్నీ సాధారణ విషయాలుగానే వ్యాపార వేత్తలు భావించాలి. దివాలా వంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించాలి. సమస్యను కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల వద్ద ప్రస్తావించి వారి మద్దతు తీసుకోవాలి. రుణ దాతలకు పరిస్థితిని అర్థమయ్యేలా వివరించాలి. రోజువారీ ఖర్చులు తగ్గించుకుంటూ.. తిరిగి పుంజుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.