FY21లో 1.38 లక్షల కొత్త ఉద్యోగాలు, ఐటీకి భారీ ఆర్డర్లు: వీటికి భవిష్యత్తు
మార్చి 31వ తేదీతో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి గాను భారత టెక్నాలజీ రంగం ఆదాయం 2.3 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చునని NASSCOM అంచనా వేస్తోంది. ఇప్పటికే నియామకాలు పెరిగాయని, మరింతగా పెరుగుతాయని పేర్కొంది. కొత్త స్టార్టప్స్ 1600 పెరిగినట్లు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14.50 లక్షల కోట్లకు ఆదాయం చేరుకోవచ్చునని అంచనా వేస్తోంది. కరోనా నేపథ్యంలో భారీగా దెబ్బతిన్న రంగాల్లో వేగంగా పుంజుకునేది ఐటీయేనని పేర్కొంది. 'న్యూవరల్డ్: ది ఫ్యూచర్ ఈజ్ వర్చువల్' పేరుతో వెల్లడించిన రివ్యూలో పలు అంశాలను పేర్కొంది.
2021లో ఇన్వెస్ట్ చేయండి, ఈ ఏడాది బెస్ట్ ప్రభుత్వ పథకాలు.. తెలుసుకోండి
ఐటీ ఆదాయం వృద్ధి, కొత్త ఉద్యోగాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఆదాయం వృద్ధి 2.3 శాతం వృద్ధితో 19,400 కోట్ల డాలర్లు లేదా రూ.14.50 లక్షల కోట్లకు చేరుకుంటుందని నాస్కాం అంచనా వేస్తోంది. ఇందులో ఎగుమతులు 1.9 శాతం వృద్ధితో రూ.11.25 లక్షల కోట్లకు చేరుకోవచ్చునని అంచనా. నికరంగా రూ.1.38 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. దీంతో ఐటీ ఇండస్ట్రీలో నిపుణుల సంఖ్య 44.7 లక్షలకు చేరింది. 2021 మార్చితో ముగిసే ఏడాదిలో దేశీయ ఆదాయాలు 3.4 శాతం పెరిగి దాదాపు రూ.3.37 లక్షల కోట్లకు చేరుకోవచ్చునని అంచనా.
1600 కొత్త స్టార్టప్స్
దేశీయ జీడీపీలో ఐటీ పరిశ్రమ వాటా 8 శాతంగా ఉంది. సేవల ఎగుమతుల్లో 50 శాతం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 50 శాతం వాటా ఉంది. 2020-21లో ఐటీ కంపెనీలు మన దేశంలో 1.15 లక్షలు, అమెరికాలో 8000 చొప్పున పేటెంట్లకు దరఖాస్తు చేసుకున్నాయి. 1600 కొత్త స్టార్టప్స్ వచ్చాయి. దీంతో మొత్తం టెక్ స్టార్టప్స్ సంఖ్య 12,500కు చేరుకుంది. 12 కొత్తగా యూనికార్న్ జాబితాలో చేరాయి.
వీటికి భవిష్యత్తు
లిస్టెడ్ కంపెనీలు వెల్లడించిన ఆర్డర్స్ 1500 కోట్ల డాలర్ల వరకు ఉన్నాయి. ఐటీ రంగంపై సానుకూల దృక్పథంతో ఉన్నట్లు 100 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్స్తో నిర్వహించిన సర్వేలో తేలింది. నియామకాలు కూడా 2020తో చూస్తే 2021లో ఎక్కువగా ఉంటాయని 95 శాతం మంది తెలిపారు. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ మరింతగా రాణించనున్నాయి. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోం నుండి పని చేసే ఈ విధానం కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయితే ఎంత శాతమన్నది ఇప్పుడే చెప్పలేమని తెలిపింది.