ఇళ్ల కొనుగోలుకు హోసింగ్ ఫర్ ఆల్: రూ.25,000 చెల్లించి బుక్ చేయొచ్చు, ప్రయోజనాలివే...
2022 నాటికి అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ ఎల్ఐసీ 2020 హోమ్ లోన్ ఆఫర్ను ప్రకటించింది. ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గిస్తుండటంతో వివిధ బ్యాంకులు హోమ్ లోన్ రేటును తగ్గిస్తున్నాయి. తాజాగా, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఇళ్ల విక్రయం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (Naredco) మొదటిసారి ఈ-కామర్స్ వెబ్సైట్ను తీసుకు వచ్చింది.
LIC హౌసింగ్ లోన్పై బంపరాఫర్: అప్పటి దాకా EMI చెల్లించక్కర్లేదు, ఆఫర్ ఎప్పటి వరకంటే
ఈ వెబ్ సైట్ ద్వారా వీటిని మాత్రమే విక్రయిస్తారు
HousingForAll.Com పేరుతో ఈ వెబ్సైట్ను లాంచ్ చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా దీనిని ప్రారంభించారు. RERA కింద నమోదైన నమ్మకమైన, భద్రమైన, నాణ్యమైన ఇళ్లను మాత్రమే ఈ వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 13వ తేదీ వరకు గడువు
రెడీ టు హోమ్స్ను వర్చువల్ రియాల్టీ ద్వారా పరీక్షించుకొని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో దాదాపు వెయ్యి ప్రాజెక్టులను లిస్ట్ చేయనున్నారు. ఈ వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకోవడానికి స్థిరాస్థి వ్యాపారులకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది.
మార్చి 1 నుంచి విక్రయాలు.. 45 రోజుల ఫెస్టివెల్
ఫిబ్రవరి 14 నుంచి కస్టమర్లకు ఇది అందుబాటులోకి వస్తుంది. మార్చి 1వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇది 45 రోజుల ఆలిండియా ఆన్లైన్ హోమ్ బయ్యింగ్ ఫెస్టివెల్ నిర్వహిస్తోంది.
ఇదో గొప్ప ముందడుగు
ఇంటిని కొనాలని చూసేవారికి ఇది గొప్ప ముందడుగు అని, వాటాదారులతో చర్చల సందర్భంగా ఈ పోర్టల్లో విశ్వసనీయత చాలా ముఖ్యమని చెప్పానని, ఎవరైనా ఆస్తిని కొనేందుకు ఆసక్తి చూపితే అది కలిగి ఉన్న ప్రాంతం, ధర కచ్చితంగా ఉండాలని, పోర్టల్ ద్వారా హామీ ఉంటుందని మిశ్రా చెప్పారు. ఇల్లు అనేది కేవలం మూడు నాలుగేళ్ళ సంవత్సరాలకు పరిమితమయ్యే ఆస్తి కాదని, రాబోవు తరాల కోసం కొనుగోలు చేస్తారని, ఇది పెట్టుబడిగా కాదని, నేరుగా జీవితానికి సంబంధించిన అంశమన్నారు.
అందుబాటులో లక్షల ఇళ్లు
రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రకారం దేశంలో దాదాపు 1 లక్షకు పైగా రెడీ టూ హోమ్ ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఏడాదిలో వీటి సంఖ్య 2.75 లక్షలకు పైకి చేరుకుంటుందని అంచనా.
కొనుగోలుదారులకు ప్రయోజనం
ఈ పోర్టల్ కొనుగోలుదారులు ఉత్తమ ధరకు ఇంటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. బయ్యర్స్ ఫ్లోర్ ప్లాన్స్, రూమ్ కొలతలు వంటి వాటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. బయ్యర్స్ పోర్టల్ ద్వారా నేరుగా రూ.25,000 రీఫండబుల్ పేమెంట్ చెల్లించి ఇంటిని బుక్ చేసుకోవచ్చు. దీంతో మనీ రిటర్న్ గ్యారెంటీ ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేయకూడదని అనుకుంటే ఆ మొత్తం తిరిగి ఇస్తారు. షార్ట్ లిస్ట్ ద్వారా ఏదైనా ఇల్లు అమ్ముడుపోతే కొనుగోలుదారులకు తెలియజేస్తారు.