చైనా నుండి మిస్టరీ ప్యాకెట్లు! అమెరికాలో సేల్స్పై అమెజాన్ బ్యాన్
అమెరికాలో దిగుమతి చేయబడిన విత్తనాల అమ్మకాలపై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిషేధం విధించింది. అమెరికాలోని వేలాదిమంది రైతులకు ఇతర దేశాల నుండి దిగుమతి అయిన విత్తనాల ప్యాకెట్లు అందాయి. కానీ ఆ విత్తన ప్యాకెట్లను తాము ఆర్డర్ చేయలేదని ఆ రైతులు తెలిపారు. దీంతో అక్రమంగా విదేశాల నుండి దిగుమతి అవుతున్న విత్తనాలను నిషేధిస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం తెలిపింది. ఇందులో ఎక్కువగా చైనా నుండి దిగుమతి అయినట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
శుభవార్త, SBI హోమ్లోన్ తీసుకునేవారికి అదిరిపోయే న్యూస్: వడ్డీరేట్లపై కీలక ప్రకటన
14 రకాల మిస్టరీ ప్యాకేజీ విత్తనాలు
ప్రస్తుతం తాము అమెరికా అమ్మకందారుల ద్వారా మాత్రమే విత్తనాలను విక్రయించడానికి అనుమతిస్తున్నామని అమెజాన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికన్లకు పెద్ద ఎత్తున ప్యాకేజ్డ్ విత్తనాలు వచ్చాయని జూలై చివరలో అమెరికా వ్యవసాయ శాఖ తెలిపింది. అమెరికా వ్యవసాయానికి ప్రమాదకరమని భావిస్తే వాటిని నాటవద్దని హెచ్చరించింది. మిస్టరీ ప్యాకేజీ విత్తనాల్లో పుదీనా, ఆవాలు, రోజ్మెరీ, లావెండర్, గులాబీ సహా 14 రకాల విత్తనాలు ఉన్నట్లుగా గుర్తించారు.
స్కాంకు సంబంధించి ఆధారాల్లేవు
ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి పూర్తి ఆధారాలు లేవని, అమ్మకాలను పెంచుకోవడానికి ఆర్డర్ చేయని కస్టమర్లకు పంపిస్తుంటారని చెబుతున్నారు. స్కాం జరిగినట్లుగా కచ్చితమైన ఆధారాలు లేవని, అమ్మకందార్లపై నిఘా పెట్టనున్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం తెలిపింది.
వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం
ఇటీవల అమెజాన్ వినియోగదారుల భద్రతకు మరింత ప్రాధాన్యతను ఇస్తోంది. మరోవైపు, వినియోగదారులకు చేరుకోవడానికి ఈ ఆన్లైన్ దిగ్గజం కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అమెజాన్తో ప్రపంచ దిగ్గజ కంపెనీలు జట్టు కట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే సామాజిక దూరంతో పాటు ఇతర దేశాల నుండి దిగుమతులపై జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.