దమానీ, బిర్లా ఆస్తులంత.. ఎలాన్ మస్క్ సంపద ఒక్కరోజే ఎంత పెరిగిందంటే?
యూఎస్ బేస్డ్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద నిన్న ఒక్కరోజే భారీగా ఎగిసింది. ఇంకా చెప్పాలంటే నిన్న ఆయన ప్రతి ఒక గంట సంపాదన రూ.11 వేల కోట్లకు పైగా ఉంది. సోమవారం టెస్లా స్టాక్స్ అదరగొట్టాయి. దీంతో ఆయన నికర సంపద 36.2 బిలియన్ డాలర్లు లేదా రూ.2.72 లక్షల కోట్లు పెరిగింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 289 బిలియన్ డాలర్లు లేదా రూ.21.68 లక్షల కోట్లకు చేరుకుంది. ఆయన ఒక్కరోజు సంపాదన ఎంత పెరిగిందంటే.. భారత కుబేరులు రాధాకిషన్ ధమానీ, కుమార్ మంగళం బిర్లా నికర ఆదాయం కంటే ఎక్కువ కావడం గమనార్హం. మస్క్ సంపద నిన్న ఒక్కరోజే 36.2 బిలియన్ డాలర్లు (రూ.2.72 లక్షల కోట్లు) పెరిగింది. దమానీ నికర సంపద 23 బిలియన్ డాలర్లు, కేఎం బిర్లా సంపద 12.1 బిలియన్ డాలర్లు. వీరిద్దరి సంపద కలిసి కూడా 35.1 బిలియన్ డాలర్లు మాత్రమే. మస్క్ ఒకరోజు సంపద వీరిద్దరి ఆదాయం కంటే ఎక్కువ.
కారు రెంటల్ కంపెనీ కీలక ప్రకటన
టెస్లా స్టాక్స్ సోమవారం 13 శాతం మేర లాభపడ్డాయి. దీంతో టెస్లా ఇంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారి 1 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. టెస్లా స్టాక్స్ భారీగా లాభపడటానికి ప్రధాన కారణం.. ప్రముఖ రెంటల్ కారు దిగ్గజ సంస్థ హెర్ట్జ్ కీలక ప్రకటన చేసింది. తాము 2022 ఏడాది ముగిసేనాటికి టెస్లా నుండి 100,000 కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించామని ప్రకటించింది. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఈవీలు ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమంగా ఆమోదించబడుతున్నాయనే సంకేతంతో 2022 చివరి నాటికి టెస్లా నుండి లక్ష కార్లను కొనుగోలు చేయాలనే ఈ ప్రకటన స్టాక్ జంప్కు కారణమైంది.
టెస్లాకు ఇవి ప్లస్
అంతకుముందువారం టెస్లా బలమైన ఆదాయ ఫలితాలను ప్రకటించింది. సెమీ కండక్టర్స్ కొరత ఉన్నప్పటికీ ఇతర వాహన తయారీదారులు దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, తమపై అంత ప్రభావం లేదని తెలిపింది. అప్పటికే ఈ అంశం టెస్లాకు సానుకూలంగా మారింది. ఈ ఫలితాల అనంతరం హెర్డ్జ్ ప్రకటన మరింత దూకుడు పెంచింది.
మరోవైపు, టెస్లా షేర్ ధరను మోర్గాన్ స్టాన్లీ భారీగా పెంచింది. గతంలో 894 డాలర్ల నుండి 1200 డాలర్లకు పెంచింది. అయితే ఈ స్టాక్ ఇప్పటికే 1078 డాలర్లకు చేరుకుంది. కరోనా నేపథ్యంలో సరఫరా గొలుసులో ఇబ్బందులు ఉన్నప్పటికీ గత త్రైమాసికంలో కంపెనీ అసాధారణ ఆదాయాన్ని నమోదు చేసింది. తదుపరి 12 నెలల నుండి 18 నెలలు టెస్లా ట్రిలియన్ డాలర్ల సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఎందుకంటే ఉత్పత్తిని పెంచుతోందని, దాని సామర్థ్యం, మోడల్ ఆఫర్స్, సర్వీస్ ఆఫర్స్ విస్తరిస్తోందని పేర్కొంది.
గంటకు రూ.11.31 వేల కోట్లు
సోమవారం ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపద ఏకంగా 36.2 బిలియన్ డాలర్లు పెరిగింది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.2.71 లక్షల కోట్లు. గంటకు సుమారు రూ.11.31 వేల కోట్లు. సోమవారం ఒక్కరోజే టెస్లా షేరు వ్యాల్యూ 14.9 శాతం పెరిగి 1,045.02 డాలర్లకు చేరింది. నేడు మరింత ఎగిసి 1080 డాలర్లకు చేరువైంది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.07 లక్షల కోట్లకు చేరుకుంది.