Tata Group: టాటా గ్రూప్ చైర్పర్సన్ పై Mukesh Ambani ప్రశంసలు.. ఎందుకంటే..
Mukesh Ambani: వ్యాపారంలో పోటీదారులుగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం ఇస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న అంశం చాలా అరుదుగా కనిపిస్తుంది. దేశంలోని కుబేరుల్లో ఒకరైన ముకేష్ అంబానీ టాటా గ్రూప్ చైర్పర్సన్ ఎన్ చంద్రశేఖరన్పై ప్రశంసలు కురిపించారు. ఇది ప్రస్తుతం వ్యాపార ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
ఇది ఎక్కడ జరిగిందంటే..
దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మంగళవారం జరిగిన పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఎన్ చంద్రశేఖరన్ను ప్రశంసించారు. ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ వరకు విస్తరించిన టాటాల వ్యాపార సామ్రాజ్యాన్ని అసాధారణ వృద్ధివైపు నడిపించటంలో చంద్రశేఖరన్ అత్యుత్తమ పనితీరు కనబరిచారని అంబానీ అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో చేస్తున్న టాటాల కృషి స్పూర్తిదాయకమని అన్నారు. ఇదే వేదికపై అంబానీ, చంద్రశేఖరన్ లు కలిసి వేదికను పంచుకున్నారు.
నిజమైన స్పూర్తి..
వెంట్కు టాటా గ్రూప్ చైర్పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని అంబానీ వెల్లడించారు. ఆయన వ్యాపారవర్గాలకు, దేశంలోని యువతకు నిజమైన ప్రేరణ అని అన్నారు. అంబానీ విశ్వవిద్యాలయ పాలకమండలి ఛైర్మన్గా ఉండగా, టాటా సన్స్ చీఫ్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరయ్యారు. మంచి విజన్, దృఢవిశ్వాసం, గొప్ప అనుభవంతో టాటా గ్రూప్ ను ముందుకు నడిపిస్తున్నారని అంబానీ ప్రశంశించారు.
కొత్త సాంకేతికతలు..
ప్రస్తుత దశ మనల్ని మెరుగైన, ఉజ్వలమైన భవిష్యత్తుకు నడిపించే కొత్త శక్తి సాంకేతికతల సంభావ్యతపై టాటాల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముకేష్ అంబానీ అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం అగ్రరాజ్యంగా మారాలంటే.. దేశవృద్ధి దృష్టితో పని చేస్తున్న అనేక ప్రధాన పారిశ్రామిక సంస్థల సంయుక్త సంకల్పం, చొరవతోనే సాధ్యమవుతుందని అంబానీ అభిప్రాయపడ్డారు.