ధోని కోళ్ళ వ్యాపారానికి బర్డ్ ఫ్లూ సెగ..కడక్నాథ్, గ్రామప్రియ కోళ్ల ఆర్డర్లు రద్దు
ఒకపక్క కరోనా మహమ్మారితో సతమతమవుతున్న భారతదేశాన్ని ఇప్పుడు బర్డ్ ఫ్లూ కూడా వేధిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరించింది. బర్డ్ ఫ్లూ దెబ్బ ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమకు గట్టిగా తాకుతోంది. దేశవ్యాప్తంగా చికెన్ తినాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ ప్రభావం మాజీ ఇండియన్ కెప్టెన్ ధోని కోళ్ల వ్యాపారానికి సైతం తాకింది.
కడక్ నాథ్ , గ్రామ ప్రియ కోళ్ళ ఆర్డర్లు రద్దు చేసుకున్న ధోనీ ఫామ్ నిర్వాహకులు
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ప్రారంభించిన కడక్ నాథ్ కోళ్ల వ్యాపారానికి బర్డ్ ఫ్లూ సెగ తాకింది. మధ్యప్రదేశ్ కోళ్ల కు బర్డ్ ఫ్లూ సోకిన కారణంగా ధోని పౌల్ట్రీ కోసం ఆర్డర్ చేసిన రెండువేల కడక్ నాథ్ కోళ్లను, ఇదే సమయంలో రెండువేల గ్రామ ప్రియ కోళ్ల ఆర్డర్ ను రద్దు చేసుకున్నట్లు ధోని పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు పేర్కొన్నారు. సాంబో లోని ధోనికి సంబంధించిన పౌల్ట్రీ ఫామ్ ను పర్యవేక్షించే డాక్టర్ విశ్వ రంజన్ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం రెండువేల కడక్ నాథ్ కోళ్లను, అంతే సంఖ్యలో గ్రామ ప్రియా కోళ్లను ఆర్డర్ ఇచ్చామని, అవి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ లోని జాబువా నుంచి రావాల్సిన కడక్ నాథ్ కోళ్ళు
అయితే మధ్యప్రదేశ్ లోని జాబువా నుంచి కడక్ నాథ్ కోళ్లను తీసుకు రావాల్సి ఉంది. ఇక గ్రామ ప్రియ కోళ్లను హైదరాబాద్ నుంచి తీసుకు రావలసి ఉండగా బర్డ్ ఫ్లూ హెచ్చరికల నేపథ్యంలో ఈ కొనుగోళ్ళ ఆర్డర్లు వాయిదా వేసినట్లుగా పేర్కొన్నారు. ధోని యొక్క నలభై మూడు ఎకరాల ఫామ్ హౌస్ లో ఒక భాగంగా పౌల్ట్రీ ఫామ్ కూడా నిర్వహిస్తున్నారు.అందులో కడక్ నాథ్ కోళ్ల ను, గ్రామ ప్రియా కోళ్లను పెంచుతున్నారు.
అత్యధిక పోషక విలువలు కలిగిన కోళ్ళను పెంచుతూ ధోనీ వ్యాపారం
అత్యధిక పోషక విలువలు కలిగిన నల్లటి కడక్ నాథ్ కోళ్లు ధర తొమ్మిది వందల రూపాయల నుండి 1200 వరకు ఉంటుంది. గ్రామ ప్రియ కోళ్ల ధర కూడా అదేవిధంగా పలుకుతుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ,ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇక మధ్యప్రదేశ్ నుండి కోళ్ల రవాణా జరగవలసిన నేపథ్యంలో ధోని ఫామ్ నిర్వాహకులు ప్రస్తుతానికి కొనుగోళ్లను పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.