ఆర్బీఐ వడ్డీ రేట్లపై ఆర్థికవేత్తలు ఏమన్నారంటే? వృద్ధికి ఊతమిచ్చే చర్యలు
ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(MPC) గత మూడు రోజులుగా సమావేశమవుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ MPC భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభమైన MPC భేటీ నేడు (7వ తేదీ) ముగుస్తుంది. ఈసారి రెపో రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020 మే నెలలో వడ్డీ రేటును నాలుగు శాతానికి తగ్గించారు. వివిధ కారణాలతో ఇది దాదాపు ఏడాది కాలంగా యథాతథంగా ఉంది.
వృద్ధికి ఊతమిచ్చే చర్యలు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం, రిటైల్ ద్రవ్యోల్భణం దాదాపు 4 శాతంగా ఉంచాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్బీఐ కీలక రేట్లను నిర్ణయించే MPC సమావేశానికి సంబంధించిన వివరాలను శక్తికాంతదాస్ వెల్లడిస్తారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యం (+2 శాతం నుండి -2 శాతం, మార్జిన్ 2-6 శాతం) వద్ద అదుపులో ఉంచాలనే ప్రధాన లక్ష్యంతో పాటు వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటించవచ్చు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది.
ఇవి పరిగణలోకి...
ఆర్బీఐ మానిటరీ పాలసీ ముందు పలు సవాళ్లు ఉన్నాయి. ద్రవ్యోల్భణం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఆర్బీఐ 4 శాతం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఫిబ్రవరిలో 5.03 శాతంగా ఉంది. హోల్ సేల్ ద్రవ్యోల్భణం జనవరి నెలలో 2.26 శాతం కాగా ఫిబ్రవరిలో దాదాపు రెండింతలు పెరిగి 4.17 శాతంగా ఉంది. చమురు ధరలు పెరగడం కూడా ప్రభావం చూపుతాయి. గత ఆరు నెలల కాలంలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు 40 డాలర్ల నుండి 70 డాలర్లకు పెరిగి, ప్రస్తుతం 65 బ్యారెళ్ల వద్ద ఉన్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఆర్థికవేత్తల అంచనా
భారత వృద్ధి రేటు అంచనాలు ఈ ఏడాది 10.5 శాతంగా ఉండవచ్చునని ఆర్బీఐ ఫిబ్రవరిలో అంచనా వేసింది. అంతకుముందు 12 నెలల కాలానికి గాను మైనస్ 7.7 శాతం అంచనా వేసింది. బ్లూమ్బర్గ్ సర్వేలో 30 మంది ఆర్థికవేత్తలు కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని అంచనా వేశారు.