Budget 2022: హోమ్ లోన్పై ట్యాక్స్ బెనిఫిట్, అఫోర్డబుల్ హౌసింగ్ పరిమితి పెంపు.. మరెన్నో
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో రియాల్టీ రంగానికి మరింత ఊతమిచ్చే చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. హోమ్ లోన్స్ పైన, అఫోర్డబుల్ హౌసింగ్ పైన మరిన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయని, రియల్ ఎస్టేట్కు సంబంధించి పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రియాల్టీ రంగం కూడా ఊతమిచ్చే చర్యలు ఉంటాయని కోటి ఆశలతో ఉంది. ఇళ్ల కొనుగోలుదారులకు అదనపు ప్రయోజనాలు కల్పించడం ద్వారా ఈ రంగానికి మరింత ఊతమివ్వవచ్చునని చెబుతున్నారు. ఇంటి కొనుగోలుదారులకు మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని రియాల్టర్స్ కూడా కోరుతున్నారు.
పన్ను రిబేట్ పెంపు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద హోమ్ లోన్ వడ్డీ రేట్లపై కొనుగోలుదారులు రూ.2 లక్షల వరకు పన్ను రిబేట్ పొందుతున్నారు. అయితే దీనిని రూ.5 లక్షల వరకు పెంచాలని రియాల్టీ రంగం కోరుకుంటోంది. దీంత ఇళ్ల విక్రయాలు పుంజుకుంటాయని, ఇది రియాల్టీ రంగానికి దోహదపడుతుందని చెబుతున్నారు. పన్ను రిబేట్ను పెంచితే రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటుందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి అన్నారు.
హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్
ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద ఇల్లు కొనుగోలుదారులు ఇంటి రుణం అసలు చెల్లింపులపై పన్ను మినహాయింపును పొందుతున్నారు. ప్రస్తుతం దీనిపై పన్ను మినహాయింపు వార్షిక పరిమితి రూ.1.5 లక్షల వరకు ఉంది. హోమ్ లోన్ ప్రిన్సిపల్ చెల్లింపులపై మినహాయింపు పరిమితిని పెంచాలని ఈ రంగం కోరుతోంది. 2014లో దీనిని పెంచిన తర్వాత అదే కొనసాగుతోంది. హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ డిడక్షన్ను రూ.2 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని డిమాండ్లు.. ఆశలు
- అఫోర్టబుల్ హౌసింగ్ లేదా అందుబాటు ధరల్లోని గృహాలు ప్రస్తుతం రూ.45 లక్షల లోపు లెక్కిస్తున్నారు. దీనిని రూ.75 లక్షల వరకు మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.
- రియాల్టీ రంగానికి ఊతమిచ్చేలా అఫోర్డబుల్ ధరల ఇళ్ల కొనుగోలుపై అదనంగా ఇచ్చే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ స్కీంను 2022 మార్చి 31వ తేదీ వరకు పొడిగించిన కేంద్రం, ఈ బడ్జెట్లో దీనిని మరింత కాలం పొడిగించవచ్చునని భావిస్తున్నారు.
- రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక సదుపాయ హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ బడ్జెట్లో దీనిపై సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీంను 2022 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని కోరుతున్నారు.
- నిర్మాణంలో ఉన్న భవనాలపై జీఎస్టీని ఎత్తివేయాలని కోరుతున్నారు.