మారటోరియం మరో 3 నెలలు పొడిగింత, బ్యాంకులపై ఒత్తిడి
కరోనా వైరస్-లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో వ్యాపార సంస్థలు, కంపెనీలు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడే పరిస్థితి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. రెపో రేటును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇది వరకు మార్చి నుండి మే వరకు మారటోరియం ఇచ్చిన ఆర్బీఐ.. ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించింది. జూన్, జూలై, ఆగస్ట్లకు ఇప్పుడు పొడిగించింది.
2 నెలల్లో మూడోసారి.. రెపోరేటు 40 పాయింట్స్ తగ్గించిన ఆర్బీఐ: EMI తగ్గే అవకాశం
ఈఎంఐ మారటోరియం ఇలా..
అన్ని కమర్షియల్, రీజినల్ రూరల్, స్మాల్ అండ్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలో మారటోరియం వర్తిస్తుందని, ఆగస్ట్ 31, 2020 వరకు ఉంటుందని శక్తికాంత దాస్ తెలిపారు. టర్మ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్పై మూడు నెలల మారటోరియం ప్రకటించారు. మారటోరియం పొడిగింపు బ్యాంకులపై భారం కానుందని భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో బ్యాంకులు ప్రతికూల ప్రభావం ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మారటోరియం పొడిగింపు ద్వారా మరింత దెబ్బతినవచ్చునని అంటున్నారు.
బ్యాంకులపై ఒత్తిడి
ఎంఎఫ్ఐ, రిటైల్, వ్యవసాయ రుణాలు బ్యాంకులకు అతిపెద్ద ఆందోళన కలిగించే అంశాలుగా భావిస్తున్నారు. మైక్రోఫైనాన్స్ లోన్ పైన బంధన్ బ్యాంకు వంటి బ్యాంకుల్లో 71 శాతం మంది మారటోరియం వినియోగించుకున్నారు. లిక్విడిటీ సమస్య ఉన్న బ్యాంకులకు ఇది పెద్ద దెబ్బ. ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించడం బ్యాంకుల ఇబ్బందులకు కారణమవుతుందంటున్నారు.
నష్టాల్లో బ్యాంకింగ్ షేర్
మారటోరియం ప్రకటన రాగానే ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్స్ 4 శాతం కుప్పకూలాయి. బంధన్ బ్యాంకు షేర్లు 5 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 2 శాతం నష్టపోయాయి. ఈ రోజు కూడా బ్యాంకులు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
అలాంటి వారికి ఊరట
అయితే ఈఎంఐ మారటోరియం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిన ఈ పరిస్థితుల్లో చాలామందికి ప్రయోజనం అంటున్నారు. ఎందుకంటే ఈఎంఐలు చెల్లించకుంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. లిక్విడిటీ లేని వారికి.. ఒకవేళ లిక్విడిటీ ఉన్నప్పటికీ వ్యాపారం కోసం ఉపయోగించుకోవాలనుకునే వారికి ఈఎంఐ చెల్లించకపోయినా క్రెడిట్ స్కోర్ దెబ్బతినదు. కానీ లిక్విడిటీ అవసరం మేరకు ఉంటే ఈఎంఐలు చెల్లించడమే బెట్టర్ అని నిపుణులు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.