కరోనా తర్వాత భారత వృద్ధి రేటు అదుర్స్, ప్రభుత్వం చర్యలు భేష్: మూడీస్
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధిరేటును అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించింది. FY22లో భారత జీడీపీ 13.7 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చునని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(FY21)లో మైనస్ 7 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది. కరోనా వ్యాక్సీన్తో మార్కెట్లో మందగమనం తగ్గుముఖం పడుతోందని, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ తెలిపింది. భారత సార్వభౌమ రేటింగ్ Baa3గానే పేర్కొంది.
LIC సరికొత్త 'బీమా జ్యోతి' ప్లాన్: కనీస పాలసీ రూ.1,00,000, ఎన్నో ప్రయోజనాలు...
కొంత సానుకూలం...
గత ఏడాది నవంబర్ నెలలో భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మైనస్ 10.6 శాతంగా ఉండవచ్చునని, FY22లో 10.8 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. తాజాగా వీటిని సవరించింది. తాజా అంచనాల్లో FY22 వృద్ధిరేటు 3.1 శాతం పెరగగా, FY21 మైనస్ శాతం 3.6 శాతం మేర తగ్గింది. సార్వభౌమ గ్రేడింగ్కు సంబంధించి మూడీస్ సహా ఇతర అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేటింగ్ విషయంలో ఏజెన్సీలు పారదర్శకత పాటించాలని, మరింత మెరుగ్గా ఉండాలని సూచించింది.
కేంద్రం బడ్జెట్ సూపర్
2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 13.5 శాతానికి సవరించిన మూడీస్, FY23 వృద్ధి రేటును 6.2 శాతంగా అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ను మూడీస్ ప్రశంసించింది. భారత్లో ఇటీవలి పరిణామాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తెలిపింది. రాబోయే సంవత్సరానికి గాను కేంద్రం అధిక రుణాలు తీసుకోవాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని మూడీస్ పేర్కొంది. బడ్జెట్లో ద్రవ్యలోటు అంచనాలకు మించిందని, కానీ లోటు లక్ష్యం వాస్తవికంగా ఉందని పేర్కొంది.
రిటైల్ లోన్ పైన ప్రభావం
రిటైల్ లోన్ల పైన కరోనా ప్రభావం ఇంకా కనిపిస్తోందని మూడీస్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ వడ్లమాని అన్నారు. ఇదిలా ఉండగా, భారత ఆర్థిక రికవరీ వేగవంతంగా కనిపిస్తోందని ఇక్రా కూడా వెల్లడించింది. ఈ డొమెస్టిక్ రేటింగ్ ఏజెన్సీ FY22లో భారత రియల్ జీడీపీని 10.5 శాతంగా అంచనా వేసింది. భారత వేగవంత రికవరీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు, వేగవంతమైన వ్యాక్సినేషన్ వంటి వివిధ కారణాలు చూపుతున్నారు.