2021లో భారత వృద్ధిరేటు 12 శాతం, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: మూడీస్ అంచనా
భారత గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్(GDP) వృద్ధిరేటు 2021లో 12శాతం ఉండవచ్చునని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్లడించింది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఈ క్యాలెండర్ ఏడాదిలో ఈ దేశ జీడీపీ వృద్ధి రేటు సానుకూలంగా ఉందని చెబుతున్నారు. సమీపకాలంలో పరిస్థితులు భారత్కు ఎంతో సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. 2020 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ మైనస్ 7.5 శాతానికి పడిపోయిన అనంతరం డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధి సాధించింది.
డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాలకు మించి ఉన్నట్టు మూడీస్ తెలిపింది. ప్రయివేటు వినియోగం, నివాసేతర పెట్టుబడులు వచ్చే కొన్ని త్రైమాసికాల్లో చెప్పుకోతగినంత స్థాయిలో పుంజుకుంటాయని, ఇది 2021లో దేశీయ డిమాండ్ పుంజుకోవడానికి సాయపడుతుందని మూడీస్ తన తాజా నివేదికలో తెలిపింది.
గత ఏడాది జీడీపీ దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. అయితే 2021లో మాత్రం భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి 12 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్కు ముందున్న వృద్ధితో పోలిస్తే ఇది 4.4 శాతం ఎక్కువ. ద్రవ్య, పరపతి విధానాలు వృద్ధికి అనుకూలంగా ఉంటాయనే అభిప్రాయాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. ఈ ఏడాది అదనపు రేట్ల కోతలను అంచనా వేయడం లేదని తెలిపింది. దేశీయ వినియోగాన్ని చూసి అవసరమైతే ద్వితీయ అర్ధ సంవత్సరంలో కొంత ద్రవ్యపర మద్దతు అవసరం కావొచ్చునని అంచనా వేసింది. అయితే, 2021లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై రికవరీ ఆధారపడి ఉంటుందని పేర్కొంది.