మోడీ ప్రభుత్వం ఎంత చేసినా ఫలితంలేదు... భారత్కు మూడీస్ షాక్
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2019 సంవత్సరంలో భారత వృద్ది రేటు అంచనాను 5.6 శాతానికి తగ్గించింది. వినియోగ డిమాండుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోందని, అయినప్పటికీ ఇది పుంజుకోవడం లేదని అభిప్రాయపడింది. భారత్ వృద్ధి రేటును సమీక్షించామని, ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీని 5.6 శాతానికి తగ్గించామని, గత ఏడాది ఇది 7.4 శాతంగా ఉందని పేర్కొంది. భారత్లో ఆర్థిక మందగమనం గతంలో ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉందని ఈ రేటింగ్ సంస్థ పేర్కొంది.
వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
2020, 2021 నాటికి పెరుగుతుంది
మూడిస్ అక్టోబర్ నెల 10వ తేదీన 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అంతకుముందు ఉన్న వృద్ధి రేటు అంచనాను 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది. పెట్టుబడులు మందగించడం మందగమనానికి కారణమని అక్టోబర్లో మూడీస్ తెలిపింది. ఇది గ్రామీణ భారతంలో ఆర్థిక ఒత్తిడిని, బలహీనమైన ఉద్యోగ కల్పనకు దారి తీసిందని పేర్కొంది. భారత్లో ఆర్థిక కార్యకలాపాలు 2020, 2021కి పెరుగుతాయని, వృద్ధి రేటు వరుసగా 6.6 శాతం, 6.7 శాతంగా ఉంటుందని మూడీస్ పేర్కొంది.
ఇటీవలి క్వార్టర్లో భారత వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్వార్టర్లోను అదే విధంగా ఉంటుందని అంచనా. వినియోగ డిమాండ్ తగ్గడమే వృద్ధి రేటు తగ్గిపోవడానికి ప్రధాన కారణం.
మోడీ ప్రభుత్వం చర్యలు
ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కార్పోరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త తయారీ సంస్థలకు పన్ను రేటును 15 శాతానికి తగ్గించింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేస్తోంది. ఆటో సెక్టార్, బ్యాంకింగ్ రంగానికి ఊతమిచ్చే ప్రకటనలు చేసింది.
ఇవేవీ డిమాండ్ పెంచలేకపోయాయి
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, కానీ ఇవేవీ కూడా వినియోగ డిమాండును పెంచలేకపోయాయని మూడీస్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు కన్సంప్షన్ డిమాండ్ కీలకమని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలుమార్లు రెపో రేటును తగ్గించిందని, తద్వారా కీలక వడ్డీ రేట్లు తగ్గించిందని, సమీప భవిష్యత్తులోను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.