భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలు తగ్గించిన మూడీస్
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీలు వృద్ధి రేటును సవరిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం ఆర్థిక రికవరీ కనిపించడంతో వృద్ధి రేటును గతంలో 13.7 శాతంగా అంచనా వేసింది. సెకండ్ వేవ్ ఉధృతమవుతోన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఈ వృద్ధి రేటు అంచనాలను 9.3 శాతానికి కుదించింది. అదే సమయంలో సమీప భవిష్యత్తులో సావరీన్ రేటింగ్ అప్ గ్రేడ్ ఉండకపోవచ్చునని పేర్కొంది.
అంతకుముందు ఏడాది మందగమం, గత ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ప్రభావం సావరీన్ రేటింగ్ అప్ గ్రెడేషన్ పైన ఉందని మూడీస్ పేర్కొంది. సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్, కరోనా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్థిక రికవరీపై ఈ ప్రభావం భారీగానే ఉండనుంది. అలాగే కరోనా కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు గత పదిహేడు రోజులుగాదేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
అదే సమయంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.9 శాతంగా ఉంవచ్చునని పేర్కొంది. అంతకుముందు ఈ అంచనాలు 6.2 శాతంగా ఉంది. ఈసారి కరోనా సెకండ్ వేవ్ వృద్ధి రేటుపై ప్రభావం నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత సానుకూలంగా సవరించింది.