Mood of the Nation సర్వే: మందగమనంలో సీతారామన్ పనితీరు ఎలా ఉందంటే?
ఢిల్లీ: 2019లో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఎదుర్కొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు. మందగమనం ఆమెకు అతిపెద్ద సవాల్గా మారింది. భారత ఆర్థిక వృద్ధిని పట్టాలు ఎక్కించేందుకు మోడీ ప్రభుత్వం వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించారు. కానీ ఇది అంతగా సత్ఫలితాలు ఇవ్వదనేది కొందరు ఆర్థిక నిపుణుల వాదన. మందగమనం సమయంలో నిర్మలా సీతారామన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని 30 శాతం మంది విశ్వసిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది.
'మోడీకి అసంతృప్తి ఉంటే సీతారామన్ను రాజీనామా చేయమని అడగాలి'
మందగమనంలో సీతారామన్పై 46 శాతం మంది అభిప్రాయం ఇదీ
ఇండియా టుడే-కార్వీ ఇన్సైట్స్ వివిధ అంశాలపై సర్వే చేపట్టాయి. ఇందులో భాగంగా నిర్మలా సీతారామన్ పనితీరుపై డిసెంబర్ నెలలో 19 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆర్థిక మందగమనం సమయంలో హ్యాండిల్ చేయడంలో సీతారామన్ ఫెయిలయ్యారని లేదా మరింత సమయం అవసరమని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు.
39 శాతం మంది ప్రశంస
39 శాతం మంది మాత్రం సీతారామన్ ఆర్థిక మందగమనం సమయంలో సరిగ్గా హ్యాండిల్ చేశారని అభిప్రాయపడ్డారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్లో మొత్తం 12,141 మంది అభిప్రాయాన్ని సేకరించారు.
ఎక్కువ మంది సంతృప్తి
ఆర్థిక మందగమనం సమయంలో నిర్మలా సీతారామన్ బాగా హ్యాండిల్ చేశారని 39 శాతం మంది, దారుణంగా ఫెయిల్యూర్ అయ్యారని 30 శాతం మంది, ఆమె బాగానే కష్టపడ్డారని, ఆమెకు మరింత సమయం ఇవ్వాలని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 15 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు.
వృద్ధి రేటు తగ్గుదల
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 5 శాతంగా మాత్రమే ఉంటుందని అంచనా. అంతకుముందు ఏడాది 6.8 శాతంగా ఉంది. మందగమనం కారణంగా వృద్ధి రేటు దారుణంగా పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గత రెండు క్వార్టర్లలో వృద్ధి రేటు 5 శాతం, 4.5 శాతం నమోదయింది. కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.