Mood of the Nation: మోడీ ప్రైవేటీకరణకు 44% మంది మద్దతు, ఎందుకంటే?
నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL)స ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సహా వివిధ సంస్థలను ప్రయివేటీకరించేందుకు సిద్ధపడింది. ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 44 శాతం మంది మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరణకు మద్దతుగా నిలబడగా, 39 శాతం మంది వ్యతిరేకించారు. ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణపై మిశ్రమ స్పందన వచ్చింది.
Mood of the Nation సర్వే: మందగమనంలో సీతారామన్ పనితీరు ఎలా ఉందంటే?
ప్రయివేటీకరణకు 44% మంది మద్దతు, 39% మంది నో
ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను 44 శాతం మంది సమర్థించగా, 39 శాతం మంది విబేధించారు. 17 శాతం మంది మాత్రం ప్రయివేటీకరణ గురించి తెలియదని, తమకు పూర్తిగా తెలియదని చెప్పారు. ఎయిరిండియా, భారత్ పెట్రోలియం, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వంటి వాటిని ప్రయివేటీకరించడంపై మీ స్పందన ఏమిటి అనగా సర్వేలో పాల్గొన్న 12,141 మంది పైవిధంగా స్పందించారు.
మద్దతిచ్చేవారు ఏమన్నారంటే?
ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను ప్రయివేటీకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని ఈ చర్యను వ్యతిరేకిస్తున్న వారు ప్రశ్నించారు. ఇది చాలా దారుణమన్నారు. అదే సమయంలో ప్రయివేటీకరణకు మద్దతిచ్చేవారి వాదన మరోలా ఉంది. మెరుగైన వృత్తి నైపుణ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం, సరికొత్త ప్రపంచ మార్కెట్, వైవిధ్యభరిత ఉత్పత్తి వంటి ఎన్నో అనుకూలతలు ఉంటాయని చెబుతున్నారు.
రూ.1 లక్ష కోట్ల టార్గెట్
ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ గత ఏడాది నవంబర్ నెలలో సూత్రప్రాయంగా అంగీకరించింది. BPCL, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (SCI), కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, THDC ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (NEEPCO) వంటి ఐదు బ్లూచిప్ ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ద్వారా రూ.1 లక్ష కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్గా పెట్టుకుంది.