privatization: ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణపై మోడీ సర్కారు దారెటు ??
త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణలపై మోడీ సర్కారు ఆచితూచి అడుగులేస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవడం పక్కనపెట్టి, ఇప్పటికే ప్రారంభమైన ఒప్పందాలను పూర్తిచేయడంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, బిడ్డర్ల ఆసక్తిపై ఆధారపడి ఉంటాయి.
అయితే ప్రభుత్వం అనుకున్న స్థాయిలో స్పందన కరువు కావడంతో ఉపసంహరణల పురోగతి ఆశించినంత స్థాయిలో లేదని భావిస్తున్నారు. వచ్చే ఏడాది జాతీయ ఎన్నికలు జరగనుండటం, ఈసారి బడ్జెట్ ప్రస్తుత మోడీ సర్కారు చివరిది కానుండటంతో ప్రభుత్వ సంస్థలను విక్రయించడం రాజకీయంగా మంచిది కాదని ప్రభుత్వం భావిస్తుండవచ్చని వినికిడి.
రెండే పూర్తిగా సక్సెస్:
ప్రస్తుత, గత ఆర్థిక సంవత్సరాల్లో ఎయిర్ ఇండియా, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లు మాత్రమే టాటా గ్రూప్కు బదిలీ అయ్యాయి. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హాన్స్తో సహా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీలు), ఓ సాధారణ బీమా కంపెనీని సైతం ప్రైవేటీకరించనున్నట్లు గతేడాది బడ్జెట్లో తెలిపారు. కానీ పీఎస్బీల్లో కదలిక లేకపోవడం, చమురు కంపెనీలకు ధరల నిర్ణయంలో స్వయంప్రతిపత్తి లేకపోవడంతో వాటి పురోగతి ముందుకు సాగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఐడీబీఐ విషయంలో మాత్రం ప్రభుత్వమే కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోందంటున్నారు.
36కి ఆమోదం 10 మాత్రమే విజయం:
వ్యాపారాలు చేయడం తమ పని కాదని ఓ సందర్భంలో పేర్కొన్న కేంద్ర సర్కారు.. పెట్టుబడి ఉపసంహరణలు కొనసాగుతూనే ఉన్నాయని చెబుతోంది. కానీ 2016 నుంచి 36 సంస్థలను ప్రైవేటీకరించడానికి ఆమోదించినా.. ఇప్పటికీ ఎయిర్ ఇండియా, ఎన్ఐఎన్ఎల్ సహా కేవలం 10 కంపెనీల విషయంలోనే విజయం సాధించిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వాటిలోనూ కొన్ని పూర్తిగా ప్రైవేటీకరించలేదనీ.. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలే తిరిగి చేజిక్కుంచుకున్నాయంటున్నారు. జరిగిన ఒకటి, రెండింటి నుంచీ ఊహించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరలేదనే వాదనా లేకపోలేదు.
చూడాలి మున్ముందు...
అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని సంస్థలను విజయవంతంగా ప్రైవేటీకరించింది. కాని మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మోడీ సారథ్యంలోని భాజపా సర్కారు మున్ముందు ఎంతవరకు విజయం సాధిస్తుందనేది చూడాలి మరి. ప్రస్తుతానికి జాతీయ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా అమ్మకాల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లడం ఉపయుక్తమని విశ్లేషకులు భావిస్తున్నారు.