Financial Aid: ఒక్కో కుటుంబానికి రూ. 50 వేలు.. డబ్బు నేరుగా అకౌంట్లోకే.. ఆ ప్రభుత్వ నిర్ణయం..
Financial Aid: సామాజిక-ఆర్థిక అభివృద్ధి విధానం పేరుతో ప్రవేశపెట్టిన స్కీమ్ లో భాగంగా ప్రజలకు నేరుగా ఆర్థిక సహకారాన్ని అందించనున్నట్లు మిజోరాం ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు అందిస్తున్నట్లు ప్రకటించింది.
కొత్త స్కీమ్ లో భాగంగా మిజోరాం ప్రభుత్వం 60,000 కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయాన్ని వారి బ్యాంక్ ఖాతాలలోకే ట్రాన్ఫర్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాన్ని 11 జిల్లాల పరిపాలనతో సమన్వయంతో తొమ్మిది శాఖలు అమలు చేస్తాయి. ఇందులో 70కి పైగా వివిధ జీవనోపాధి మార్గాలు కలిగి ఉంటాయని వెల్లడించింది. 40 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 1,500 మంది చొప్పున 60,000 మంది లబ్ధిదారులకు సహకారం అందుతుందని ముఖ్యమంత్రి జోరమ్తంగా వెల్లడించారు. లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.25 వేలు అందుతాయి.
రెవెన్యూ గ్రాంట్లు, ఇతర కేంద్ర సహాయాలు, ఇతర ఆర్థిక విభజనల కారణంగా రాష్ట్రం రూ.3,000 కోట్లకు పైగా నష్టపోయినప్పటికీ.. కుటుంబ ఆధారిత కార్యక్రమం అమలు కోసం తమ ప్రభుత్వం రూ.300 కోట్లకు పైగా కేటాయించిందని సీఎం చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్థిక పరిమితులు ఏర్పడినందున రాష్ట్ర ఆర్థిక వనరులకు అనుగుణంగా ఈ పథకం అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ విధానం ప్రకారం సుస్థిర అభివృద్ధి, కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధి కోసం లబ్ధిదారులు తమకు నచ్చిన ప్రాజెక్టులను ప్రారంభించడానికి రూ.3 లక్షలకు తక్కువ కాకుండా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం మొదట యోచిస్తోంది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 2019 నుంచి రోడ్లు, ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులను నిర్మించడం, ఉపాధ్యాయులను నియమించడం వంటి వాటి రూపంలో పాక్షికంగా అమలు చేయబడింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్లో ఎస్ఈడీపీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.350 కోట్లు కుటుంబ వికాస కార్యక్రమానికి వినియోగిస్తారు.