జియో-ఎయిర్టెల్-వొడాఫోన్ ఐడియా కలుస్తాయా? నేనే ఆ స్థానంలో ఉంటే.. సునీల్ కీలక నిర్ణయం
టెలికం రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీ ప్యాకేజీతో ఊరటను కల్పించింది. అలాగే, ఏజీఆర్ బకాయిలపై కూడా మారటోరియం విధించింది. దీంతో టెలికం రంగానికి కొత్త ఉత్సాహం వచ్చింది. గత మూడు రోజులుగా టెల్కో స్టాక్స్ దుమ్మురేపుతున్నాయి. వోడాఫోన్ ఐడియా గత మూడు రోజుల్లో దాదాపు 30 శాతం లాభపడింది. భారతీ ఎయిర్టెల్ షేర్ ధర రూ.700 దిగువ నుండి రూ.727కి ఎగబాకింది. ప్రభుత్వ ప్యాకేజీ, ఏజీఆర్ బకాయిలపై మారటోరియం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికం సంస్థలకు భారీ ఊరట.
అలాగే, వందశాతం FDIలను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు ఇది ప్రయోజనం కలిగించేదే. ప్రభుత్వం ప్యాకేజీని టెల్కోలు స్వాగతించాయి. ఇదే సమయంలో ఇన్నాళ్లు టారిఫ్ యుద్ధానికి దిగిన టెల్కోలు ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ రంగంలోకి దిగారు.
కలుస్తాం.. కుమ్మక్కు కాదు
నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడానికి మౌలిక వసతులను పంచుకోవడం వంటి అంశాల్లో టెలికాం సంస్థలను ఒక్కతాటి పైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని ఛైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగం కోసం ప్రభుత్వం బుధవారం పలు సంస్కరణలను ప్రకటించింది. బుధవారం వొడాఫోన్ అధిపతి నిక్ రీడ్తో మాట్లాడానని, త్వరలో రిలయన్స్ జియో ఛైర్మన్ ముఖేష్ అంబానీతో చర్చిస్తానని తెలిపారు.
దేశంలోని ఇతర మౌలిక కంపెనీలకు టెల్కోలు ఆదర్శంగా నిలిచేలా చేస్తామన్నారు. అలా ఉన్నంతమాత్రాన కంపెనీలు కుమ్మక్కయ్యే అవకాశం లేదన్నారు. భారత టెల్కోలు ఉమ్మడిగా పని చేయాలన్నారు. ఖర్చులు తగ్గించుకోవాలంటే దేశీయ టెలికం సంస్థలు మౌలిక వసతులను పరస్పర సహకార ధోరణితో ఉపయోగించుకోవాలన్నారు. దీంతో టెలికం సంస్థలపై భారం తగ్గుతుందని చెప్పారు.
జియోకు పోటీగా...
రిలయన్స్ జియో తీసుకు వస్తున్న అత్యంత తక్కువ ధర స్మార్ట్ ఫోన్కు పోటీగా హ్యాండ్ సెట్ తయారీదారులతో ఎయిర్టెల్ ఒప్పందాలు చేసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా సునీల్ మిట్టల్ స్పందించారు. అందుబాటు ధరలో స్మార్ట్ ఫోన్ తీసుకురావాల్సిన అవసరం వస్తే అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు.
టెలికం రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకు వెళ్లేందుకు టెలికం సేవల ప్రొవైడర్లు చేతులు కలపాల్సి ఉందని చెప్పారు. ఈ సహకార ధోరణి వల్ల టెలికం రంగంలో పోటీతత్వం నెలకొంటుందన్నారు. వోడాఫోన్ అధినేతతో మార్కెట్ పంపిణీపై ఆరోగ్యకర చర్చలు జరిగాయని, టారిఫ్ పైన కాదన్నారు. టెలికం పరిశ్రమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా చర్చలు ఉంటాయని, పంపిణీ వ్యవస్థపై మాట్లాడుకుంటామన్నారు. ఇతర కంపెనీ కంటే తమ మార్కెట్ వాటా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నప్పుడు, టారిఫ్స్ పైన చర్చలు ఎలా జరుపుతామన్నారు. కస్టమర్ల సేవకు సంబంధించి టెల్కోల మధ్య పోటీ ఉంటుందన్నారు.
నేనే ఆ స్థానంలో ఉంటే
కేంద్రం ప్రకటన వొడాఫోన్ ఐడియాకు లభించిన జీవితకాల అవకాశమని, మార్కెట్లో పటిష్ఠంగా నిలబడేందుకు గొప్ప అవకామని, వొడాఫోన్ గ్రూప్, ఐడియా కుమార మంగళం బిర్లా కలిసి తమ సంస్థ పుంజుకునేందుకు కృషి చేయాలని సునీల్ మిట్టల్ అన్నారు. నేనే వారి స్థానంలో ఉంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు రాబట్టుకునే అవకాశంగా భావిస్తానన్నారు. వొడాఫోన్ 2000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, బిర్లా వందల కోట్ల డాలర్లను ఖర్చు చేశారన్నారు. ముఖేష్ అంబానీతో మాట్లాడాక చర్చల ఫలితం ఏమవుతుందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వ మారటోరియం సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు.