ఏమేం చేస్తారోగానీ.. ఏడాదికి రూ.7 కోట్లు పుచ్చుకుంటారు!
ఓ వైపు దేశ ఆర్థిక రంగ పరిస్థితి క్షీణిస్తోంది. ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోతోంది. విద్యావంతులు ఉద్యోగాలు దొరక్క అల్లాడుతుంటే.. చాలామంది ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి డీలా పడిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా కోట్ల రూపాయల వేతనం అందుకునే వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. పైగా వీళ్ల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 22 మంది 'మిలియన్ డాలర్ సీఈవో క్లబ్'లోకి వచ్చి చేరారు.

గత ఏడాది 124, ఈ ఏడాది 146...
ఏడాదికి మిలియన్ డాలర్ జీతం. అంటే.. మన రూపాయల లెక్కలో చూసుకుంటే ఏడాదికి రూ.7 కోట్లు అన్నమాట. అవును, ఇంతింత జీతం తీసుకునే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)లు మన దేశంలో ఉన్నారు. పైగా ఈ సీఈవోల సంఖ్య తగ్గకపోగా మరింత పెరుగుతోంది. 2018 ఆర్థిక సంవత్సరంలో వీరి సంఖ్య 124 కాగా.. 2019 ఆర్థిక సంవత్సరంలో అది 146కు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే వీరి సంఖ్య 18 శాతం పెరిగినట్లు. బీఎస్ఈ 200 కంపెనీల్లో సీఈవో, సీఎఫ్ఓల జీత, భత్యాలపై ఈఎంఏ పార్టనర్స్ జరిపిన వార్షిక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

మిలియన్ డాలర్ సీఈవో క్లబ్...
ఓ వైపు రూపాయి విలువ పడిపోతున్నా.. గత నాలుగేళ్లలో ఈ జాబితాలోని సీఈవోల సంఖ్య ఈ మేర పెరగడం విశేషం. 2016 ఆర్థిక సంవత్సరంలో 119 మంది, 2017లో 120 మంది మాత్రమే మిలియన్ డాలర్ సీఈవోల క్లబ్లో ఉన్నారు. మిలియన్ డాలర్ సీఈవో క్లబ్లోని సభ్యులకు చెల్లించిన మొత్తం వేతనం కూడా 2019 ఆర్థిక సంవత్సరంలో14 శాతం పెరిగి రూ.2,457 కోట్లకు చేరింది. ఇది అంతకుముందు ఏడాది రూ.2,158 కోట్లుగా ఉంది.

ఈ ఏడాది కొత్తగా 22 మంది...
ఈ లిస్ట్లోని సీఈవో సగటు ప్యాకేజ్ రూ.16.8 కోట్లుగా ఉన్నట్టు ఈఎంఏ పార్టనర్స్ పేర్కొంది. ఈఎంఏ పార్టనర్స్ జరిపిన ఈ స్టడీలో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.70గా తీసుకుంది. దీంతో 2019 ఆర్థిక సంవత్సరంలో వార్షిక జీత, భత్యాల కటాఫ్ రూ.7 కోట్లుగా ఉంది. రూ.7 కోట్లకు పైన జీతం పొందే వారిని ఈ జాబితాలో చేర్చారు. ఈ ఏడాది కొత్తగా మిలియన్ డాలర్ సీఈవో క్లబ్లో చేరిన వారు 22 మంది.
ఇక ఈ ‘మిలియన్ డాలర్ సీఈవో క్లబ్'లో మహిళా సీఈవోల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ ఏడాది కేవలం 2 శాతం మంది ఉమెన్ సీఈవోలు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.

క్లబ్లోని సీఈవోల్లో టాప్ ఈయనే….
ఈ మిలియన్ డాలర్ సీఈవో క్లబ్లో ఉన్న ప్రముఖ ప్రమోటర్లు, ప్రొఫెషనల్ సీఈవోల్లో టాప్ ఎవరో తెలుసా? సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్. అవును, ఈయనే ఈ గ్రూప్ను లీడ్ చేస్తున్నారు. కళానిధి మారన్ ప్యాకేజీ 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.88 కోట్లు. ఆ తరువాత రెండో స్థానంలో హీరో మోటోకార్ప్ సీఎండీ పవన్ ముంజాల్ ఉన్నారు. ఈయన ప్యాకేజీ ఏడాదికి రూ.80 కోట్లు.

ఇంకా ఎవరెవరు ఉన్నారంటే...
ఇక ఈ జాబితాలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ (రూ.69 కోట్లు), ఎల్ అండ్ టీ సీఈవో, ఎండీ ఎన్.సుబ్రమణియన్ (రూ.27 కోట్లు), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వీసీ అండ్ ఎండీ జగన్ బంగా (రూ.16 కోట్లు), నెస్లే ఇండియా సీఎండీ సురేష్ నారాయణన్ (రూ.11 కోట్లు), మ్యారికో ఎండీ, సీఈవో సౌగత్ గుప్తా (రూ.9 కోట్లు) ఉన్నారు. వీరంతా ఏడాది వేతనం కింద ఇన్నిన్ని కోట్ల రూపాయలు పుచ్చుకుంటున్నారు.

లిస్టులోకి సలీల్ ఫరేఖ్ ఎంట్రీ...
ఈ మిలియన్ డాలర్ సీఈవో క్లబ్లో ఈ ఏడాది కొత్తగా 22 మంది చేరగా, వారిలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ కూడా ఉన్నారు. సలీల్ పరేఖ్ జీత, భత్యాలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 300 శాతానికి పైగా పెరిగి రూ.17 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది.. అంటే 201718 ఆర్థిక సంవత్సరంలో పరేఖ్ కేవలం రూ.4 కోట్ల వేతనం మాత్రమే ఆర్జించారు.

ప్రొఫెషనల్ సీఈవోలే అధికం….
ఈసారి లిస్ట్లో ప్రమోటర్ సీఈవోలు 61 మంది ఉంటే, ప్రొఫెషనల్ సీఈవోలు 85 మంది ఉన్నారు. అంటే ప్రమోటర్ సీఈవోలే కంటే ప్రొఫెషనల్ సీఈఓలే ఎక్కువ మంది ఉన్నట్టు ఈఎంఏ పార్టనర్స్ గుర్తించింది. అయితే గత కొన్నేళ్లుగా పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు ఆర్జించే వేతనాలపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండగా.. వీళ్లకు మాత్రం ఇన్నిన్ని కోట్లు వేతనాల కింద ఇవ్వడం సముచితమేనా? అన్న ప్రశ్న పలువురు వ్యక్తం చేస్తున్నారు.

‘‘సమర్థులైన సీఈవోలు దొరకడం కష్టమే..’’
అయితే ఇండియాలో సమర్థులైన సీఈవోలు దొరకడం చాలా కష్టంగా ఉందని ఈఎంఏ పార్టనర్స్ రీజనల్ మేనేజింగ్ పార్టనర్(ఏషియా) కే.సుదర్శన్ అంటున్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక రంగం మందగమనాన్ని ఎదుర్కొంటోందని, దీని ప్రభావం ఈసారి సీఈవోలకు ఇచ్చే బోనస్లు, కమిషన్లపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొన్ని కంపెనీల సీఈవో జీతాల్లో ఎలాంటి మార్పులు లేకపోగా.. అపోలో టైర్స్ ఓంకార్ కన్వర్ లాంటి కొంతమంది సీఈవోల వేతనాలు భారీగా పడిపోయిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు.

‘‘మరింత వాల్యు క్రియేట్ చేసేలా ఉండాలి..’’
కొన్నేళ్ల క్రితం మ్యాగీ నూడిల్స్ విషయంలో నెస్లే ఇండియా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. అయితే ఆ సంక్షోభం నుంచి కంపెనీని బయటపడేసింది ఆ కంపెనీ సీఎండీ సురేష్ నారాయణన్. తాను కేవలం శాలరీ కోసం మాత్రమే పనిచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఈవో స్థాయికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని పనిచేసేలా ప్రోత్సహించే మరికొన్ని అంశాలు కూడా ఉంటాయన్నారు. ‘‘నా అభిప్రాయం ప్రకారం.. సీఈవోలు ఇస్తున్నారు కదాని కోట్ల రూపాయల జీతాన్ని జేబులో వేసుకుని వెళ్లిపోవడం కాదు.. ఆర్గనైజేషన్కు మరింత వాల్యును క్రియేట్ చేసేలా వారు ఉండాలి. దీనికి కొలమానం కంపెనీ షేరు ధరే..'' అని ఆయన వ్యాఖ్యానించారు.