టిక్టాక్ కొనుగోలుపై ట్రంప్కు సత్య నాదెళ్ల కీలక సమాచారం! ఇండియాలో ఏం చేస్తారు?
కరోనా, వాణిజ్య యుద్ధం సహా వివిధ కారణాలతో చైనా యాప్స్పై వివిధ దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాచర్యల్లో భాగంగా భారత్ ఇప్పటికే టిక్టాక్ సహా చైనాకు చెందిన వివిధ యాప్స్ను నిషేధించింది. భారత్ దారిలో నడవాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు లేఖ రాయగా, అగ్రరాజ్యం అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగు వేస్తున్నారు. దీంతో టిక్టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ చైనా ముద్రను తొలగించుకునేందుకు వాటాలు విక్రయించాలని భావించింది. టిక్టాక్ యాప్ అమెరికా కార్యకలాపాల్ని విక్రయించేందుకు చర్చలు సాగుతున్నాయి.
భారీగా తగ్గిన స్మార్ట్ఫోన్ సేల్స్: ఇండియాలో అడుగుపెట్టాక తొలిసారి ఈ చైనీస్ కంపెనీకి షాక్!
టిక్టాక్ కొనుగోలుపై సత్య నాదెళ్ల
టిక్టాక్ యాప్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయడంపై దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్తో చర్చలు జరుపుతున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ యాప్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆదివారం డౌనాల్డ్ ట్రంప్తో చర్చించారు. యాప్ పని తీరు విషయంలో ట్రంప్ లేవనెత్తిన ఆందోళనలపై విస్తృతంగా చర్చించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.
యాప్ భద్రత, కొనుగోలుపై ట్రంప్కు నాదెళ్ల
అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోను టిక్టాక్ యాప్ కార్యకలాపాల్ని కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇందుకు సంబంధించి బైట్ డ్యాన్స్తో సెప్టెంబర్ 15 నాటికి చర్చలు పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. అమెరికాలో టిక్టాక్ను పూర్తిగా నిషేధిస్తామని ట్రంప్ ప్రకటించిన అనంతరం సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. యాప్ భద్రత, పనితీరు, కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అంశాలను అధ్యక్షుడికి వివరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ట్రంప్ ఆందోళనలకు పరిష్కారం లభించేలా కొనుగోలు
దేశ అధ్యక్షుడి ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటున్నామని, వాటికి సరైన పరిష్కారం లభించే విధంగా కొనుగోలు ఒప్పందం ఉంటుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అంతేకాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. టిక్ టాక్ ప్రయివేట్ డేటా అమెరికాకు ట్రాన్సుఫర్ చేస్తామని పేర్కొంది. ఏదైనా డేటా బయటి దేశాల్లో ఉంటే కనుక దానిని మైక్రోసాఫ్ట్ డిలీట్ చేస్తుందని కూడా స్పష్టం చేసింది. మైనార్టీ వాటాల కోసం ఈ ఒప్పందంలోకి ఇతర సంస్థల్ని ఆహ్వానిస్తామని పేర్కొంది.
ఇండియాలో ఏం చేస్తుంది?
అమెరికా సహా పలు దేశాలకు చెందిన టిక్టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఇప్పటికే ఈ యాప్ను మన దేశంలో నిషేధించారు. దీనిపై మైక్రోసాఫ్ట్, టిక్టాక్ ఏం చేస్తుందనేది చూడాలని అంటున్నారు. భారత్లో అతి తక్కువ కాలంలో అత్యధిక యూజర్లతో వేగంగా విస్తరించింది టిక్టాక్. కాగా, టిక్ టాక్ యూజర్ల ఫోన్ నెంబర్లు, చిరునామా, పరిచయాలు వంటి పర్సనల్ డేటాను చైనాకు చేరవేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.