భారత ఫిన్టెక్ గ్రోలో ఇన్వెస్ట్ చేసిన సత్య నాదెళ్ల, కంపెనీకి సలహాలు
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ 'గ్రో'లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేశారు. కంపెనీకి సలహాలు కూడా ఇస్తారు. ఈ మేరకు 'గ్రో' కో-ఫౌండర్ అండ్ సీఈవో లలిత్ కెష్రే సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ''గ్రో'లో ప్రపంచ బెస్ట్ సీఈవో ఇన్వెస్ట్ చేశారు. అలాగే అడ్వైజర్గా ఉన్నారు. భారత్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ యాక్సెసబులిటీ కోసం సత్య నాదెళ్ల తమతో చేరినందుకు ఆనందంగా ఉంది.' అని పేర్కొన్నారు. 2021లో గ్రో రెండుసార్లు ఫండ్ రైజ్ చేసింది. ఇందులో భాగంగా సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేశారు.
గ్రో కంపెనీ మొదటిసారి 1 బిలియన్ డాలర్ల వద్ద ఏప్రిల్ నెలలో 83 మిలియన్ డాలర్లను సమీకరించింది. రెండోసారి అక్టోబర్ నెలలో 3 బిలియన్ డాలర్ల వద్ద 251 మిలియన్ డాలర్లను సమీకరించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఆరోగ్యపరమైన ఆందోళనలతో ప్రజల ఆలోచన ధోరణిలో మార్పులు చోటు చేసుకున్నాయి.
పెట్టుబడులు పెట్టడం, పొదుపుపై దృష్టిసారించే వారి సంఖ్య పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీల తొలి పబ్లిక్ ఇష్యూల్లోను పెట్టుబడులు పెట్టడానికి రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ అంశాలు గ్రో వంటి కంపెనీల వినియోగదారులు పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
గ్రో కంపెనీ తన వ్యాపార వృద్ధి మూలంగా ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఫ్లిప్ కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ అయిన లలిత్ కెష్రే, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సాల్ 2016లో గ్రో ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఐపీఓలు, యూఎస్ స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, గోల్డ్ వంటి వాటిలో యూజర్లు పెట్టుబడులు పెట్టేందుకు సహకరిస్తుంది. తన ప్లాట్ఫామ్ వినియోగదారుల సంఖ్య రెండు కోట్లకు పైగా ఉందని కంపెనీ తెలిపింది.