భాగ్యనగరానికి అమెరికా ఐటీ మేజర్ మైక్రాన్
భాగ్యనగరానికి ప్రఖ్యాత సంస్థ రాబోతోంది. నానక్రాంగూడలోని ఫీనిక్స్ సెజ్లో అమెరికన్ ఐటీ మేజర్ మైక్రాన్ టెక్నాలజీ 1.03 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండలిలో అతి పెద్ద లీజింగ్ ఒప్పందం కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన కంపెనీ దరఖాస్తును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో సెజ్ కార్యకలాపాలను పర్యవేక్షించే విశాఖపట్నం సెజ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ రామ్మోహనరెడ్డి ఆమోదించారు.
ఫీనిక్స్ టెక్జోన్లోని పద్నాలుగు అంతస్తుల భవనంలోకి మైక్రాన్ అడుగు పెట్టనుంది. వచ్చే నెల నుంచి మైక్రాన్ సంస్థ 91,625 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే తాత్కాలిక ఇంక్యుబేషన్ స్థలంలో కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. శాశ్వత కార్యాలయం సిద్ధమయ్యాక అందులోకి మారుతుంది. హైదరాబాద్ కార్యకలాపాల ద్వారా మైక్రాన్ సంస్థ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది.
ఇరాన్-అమెరికా ఇష్యూ: భారత్లో సామాన్యుడిపై భారమెలా?
రానున్న అయిదేళ్లలో దాదాపు రూ.3,820 కోట్లు పెట్టుబడి పెట్టనుందని తెలుస్తోంది. రూ.6,228 కోట్ల మేరకు ఎగుమతుల లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ క్రమంలో మైక్రాన్ సంస్థలో కనీసం 5,000 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. హైదరాబాదుకు తమ కార్యకలాపాలు విస్తరిస్తామని మైక్రాన్ ముందే చెప్పిందని, చెప్పిన దాని కంటే వేగంగా కంపెనీని ప్రారంభించడం సంతోషమని ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.